Begin typing your search above and press return to search.

బాబు, కేసీఆర్ మధ్య జరిగిన ఒప్పందమేంటి?

By:  Tupaki Desk   |   1 July 2016 10:32 AM GMT
బాబు, కేసీఆర్ మధ్య జరిగిన ఒప్పందమేంటి?
X
రెండు రాష్ట్రాల మధ్య హైకోర్టు విభజన అంశం ఇప్పుడు ముదిరిపాకాన పడింది. న్యాయవాదుల ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. కేసీఆర్ కేంద్రాన్ని నిందిస్తుంటే కేంద్రం కేసీఆర్ వైఖరిని తప్పు పడుతోంది. ఇంకొందరు చంద్రబాబుపైనా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ నేత - మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాత్రం ఇద్దరు సీఎంల కలిసి కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. మెద‌క్ జిల్లాలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్‌ - చంద్ర‌బాబుల మ‌ధ్య చీక‌టి ఒప్పందం జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. వారిద్దరూ రహస్యంగా ఒప్పందం చేసుకున్నారని.. అందుకే హైకోర్టు విభ‌జ‌న జ‌ర‌గ‌డం లేద‌ని పొన్నం ఆరోపించారు.

కేసీఆర్ ఢిల్లీలో ధ‌ర్నాకు దిగుతాన‌ని అంటున్నార‌ని.. దాని వల్ల ఎలాంటి ఫలితం ఉండదని.. చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబుతో చర్చలు జరపాలని సూచించారు. ఏపీ సీఎంతో కేసీఆర్ మాట్లాడి న్యాయ‌వాదుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న అన్నారు. కేసీఆర్ స్వార్థంతో ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, అందుకే న్యాయ‌వాదులు రోడ్డెక్కి నిర‌స‌న తెలిపే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

మరోవైపు హైకోర్టు విభజన కోరుతూ చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చిన తెలంగాణ న్యాయ‌వాదులు ఈరోజు కదం తొక్కారు. దీంతో హైద‌రాబాద్ ఇందిరాపార్క్ వ‌ద్ద‌కు తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో న్యాయవాదులు చేరారు. హైద‌రాబాద్‌ లో ఉన్న హైకోర్టు ఉమ్మ‌డి హైకోర్టులా లేదని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులా ఉంద‌ని తెలంగాణ న్యాయ‌వాదులు ఆరోపిస్తున్నారు. న్యాయవాదుల ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీల నుంచి మద్దతు దొరుకుతోంది. నాయకులూ కూడా న్యాయవాదుల ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో పొన్నం ఆరోపణలపై టీఆరెస్ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. హైకోర్టు కోసం ఢిల్లీలో దీక్ష చేయడానికి రెడీ అవుతున్న కేసీఆర్ పై విమర్శలు చేసే స్థాయి పొన్నం ప్రభాకర్ కు లేదంటూ విరుచుకుపడుతున్నారు.