Begin typing your search above and press return to search.

పోలింగ్ ముగిసింది.. వారికి షాకిచ్చిన పార్టీలు

By:  Tupaki Desk   |   19 April 2019 4:31 AM GMT
పోలింగ్ ముగిసింది.. వారికి షాకిచ్చిన పార్టీలు
X
ఎన్నిల‌కు ఏడాది ముందు నుంచి అన్ని పార్టీల్లోనూ ఒక‌టే హ‌డావుడి. మారిన కాలానికి త‌గ్గ‌ట్లుగా.. అందుబాటులోకి వ‌చ్చిన సెల్ ఫోన్లు.. కొత్త సాంకేతికత నేప‌థ్యంలో అవ‌స‌ర‌మైన సిబ్బందికి సంబంధించిన రిక్రూట్ మెంట్ భారీగా సాగింది. మీడియాకు మించి ప్ర‌భావం చూపించే వీలున్న సోష‌ల్ మీడియాలో పార్టీ కార్య‌క‌లాపాలు భారీ ఎత్తున సాగ‌టానికి వీలుగా ప‌లు పార్టీలు ప్ర‌త్యేకంగా ఆఫీసులు ఓపెన్ చేశాయి.

సోష‌ల్ మీడియాలో పెట్టే పోస్టుల కోసం కంటెంట్ రైట‌ర్స్ తో పాటు.. టెలీకాల‌ర్లు.. ఫోటోషాప్ డిజైన్ల‌తో పాటు.. వివిధ అంశాల‌కు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తీసుకున్నారు. వీరి కోసం ప్ర‌త్య‌కంగా కార్యాల‌యాల్ని ఏర్పాటు చేసిన పార్టీలు కొన్ని అయితే.. మ‌రికొన్నిపార్టీలు త‌మ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలోనే ప‌ని చేశాయి. ఈ ప‌ని కోసం నియ‌మించుకున్న ఉద్యోగుల‌కు పెద్ద ఎత్తున జీతాలు ఇచ్చిన పార్టీలు.. ఎన్నిక‌లు ముగిశాయో లేదో.. వారికి చేయిచ్చేసి.. ఆఫీస్ మూసేస్తున్న విష‌యాన్ని చెబుతున్నారు.

జ‌న‌సేన పార్టీ ఐటీ సెంట‌ర్ కోసం రాయ‌దుర్గంలోని ఖాజాగూడ స‌మీపంలో మూడు అంత‌స్థుల భ‌వ‌నాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇందులో దాదాపు 500 మంది వ‌ర‌కూ సిబ్బందిని నియ‌మించుకున్నారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తోట చంద్ర‌శేఖ‌ర్ కోఆర్డినేట‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. ఎన్నిక‌లు ముగిసి వారం కాక ముందే.. ఐటీ సెంట‌ర్లో ప‌ని చేసే సిబ్బందిని పెద్ద ఎత్తున గుడ్ బై చెప్పేశారు.మొన్న‌టి వ‌ర‌కూ మూడు అంత‌స్థుల్లో క‌ళ‌క‌ళ‌లాడిన పార్టీ కార్యాల‌యం ఇప్పుడు ఒక అంత‌స్థుకు ప‌రిమితం కాగా.. మిగిలిన రెండు అంత‌స్థుల్లో టూలెట్ బోర్డు పెట్టేశారు.

గ‌తంలో 500 మంది ఉద్యోగుల స్థానే.. ఇప్పుడు వంద నుంచి 150 మంది వ‌ర‌కూ ఉద్యోగుల‌తో సోష‌ల్ విభాగాన్ని న‌డిపించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. జ‌న‌సేన త‌ర‌హాలోనే చాలా వ‌ర‌కూ అన్ని పార్టీలు ఇదే తీరును ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు చెప్పాలి. అయితే.. మ‌రికొన్ని పార్టీలు మాత్రం.. జీతాల్లేకుండా.. సానుభూతిప‌రులు.. మ‌ద్ద‌తుదారుల‌తో ఈ త‌ర‌హా ఆఫీసుల్ని నిర్వ‌హించాయి. ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే స‌ద‌రు ఆఫీసుల్ని మూసేయాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.