Begin typing your search above and press return to search.

నంద్యాల‌లో శిల్పా అనుచ‌రుడిపై సోదాలు

By:  Tupaki Desk   |   11 Aug 2017 7:57 AM GMT
నంద్యాల‌లో శిల్పా అనుచ‌రుడిపై సోదాలు
X
ఉప ఎన్నిక‌కు రోజులు స‌మీపిస్తున్న కొద్దీ.. నంద్యాల‌లో అధికార టీడీపీ అరాచ‌కాల‌కు అడ్డు అదుపు లేకుండా పోతోందన్న వాద‌న‌కు క్ర‌మంగా బ‌లం చేకూరుతోంది. ఇక్క‌డ గెలుపు వైసీపీ అభ్య‌ర్థిదేన‌ని స్ప‌ష్ట‌మైపోవ‌డంతో టీడీపీ నేత‌లు త‌మ అధికారాన్ని - అధికారుల‌ను అడ్డుపెట్టుకుని వైసీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. పోలీసుల‌ను అడ్డుపెట్టుకుని వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌ రెడ్డికి మ‌ద్ద‌తిస్తున్న‌వారిని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్న వైనం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న నంద్యాల‌లో సంచ‌ల‌నం సృష్టించింది.

స్థానికుడైన రమేశ్‌బాబు.. మెడిక‌ల్ షాపు నిర్వ‌హిస్తున్నారు. ల‌య‌న్స్ క్ల‌బ్ ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేస్తుంటారు. ఈయ‌న వైసీపీ అభ్య‌ర్థి శిల్పాకు ప్ర‌త్యేక అభిమాని, ఆయ‌న‌కు మ‌ద్ద‌తుదారు కూడా. టీడీపీలో శిల్పా ఉన్న‌ప్ప‌టి నుంచి కూడా ర‌మేశ్‌ బాబు మ‌ద్ద‌తుదారే. అయితే, అనూహ్యంగా శిల్పా ఇప్పుడు వైసీపీలోకి మారేస‌రికి పోలీసులు ఒక్క‌సారిగా ర‌మేశ్‌ బాబుపై నిఘాను పెంచేశారు. అంతేకాదు, ఈయ‌న మెడిక‌ల్ స్టోర్‌ - ఇంటిపై అర్ధ‌రాత్రి వేళ దాడికి పాల్ప‌డ్డారు. మెడిక‌ల్ షాపులో ఉంచిన ల‌య‌న్స్ క్ల‌బ్‌ కు చెందిన రూ.3.57 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ స‌మ‌యంలో ర‌మేశ్‌బాబు.. ఆ డ‌బ్బులు ల‌య‌న్స్ క్ల‌బ్‌ వాళ్ల‌వ‌ని, వాళ్లు క‌ట్టిన చందా ర‌శీదులు కూడా ఉన్నాయ‌ని చూపించినా .. పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన ర‌మేశ్‌ బాబు అధికార పార్టీ దాష్టీకంపై విరుచుకుప‌డ్డారు. అర్థరాత్రి తమ ఇంటికి వచ్చి కిటికీ పగలగొట్టి పోలీసులు లోపలకు చొచ్చుకొచ్చారని చెప్పారు. తాను ఎటువంటి రాజకీయ ప్రచారం చేయలేదని తెలిపారు. శిల్పా మోహన్‌ రెడ్డి మద్దతుదారులమన్న ఏకైక కారణంతో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

ఇదే ఘ‌ట‌న‌పై స్పందించిన వైసీపీ నేత - ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి టీడీపీ అరాచ‌కాల‌పై విరుచుకుప‌డ్డారు. ప్రభుత్వం ఎంత దౌర్జన్యం చేసినా తమ కార్యకర్తలు భయపడరని ఉద్ఘాటించారు. అర్థరాత్రి వ్యాపారి రమేశ్‌ ఇంటి తలుపు బద్దలుకొట్టి డబ్బులు పట్టుకెళ్లారని, సేవా కార్యక్రమాలకు చెందిన డబ్బు అని చెప్పినా పోలీసులు వినలేదని తెలిపారు. చంద్రబాబు బెదిరింపులు, దౌర్జన్యాలు మానుకోవాలని హితవు పలికారు. మొత్తానికి అధికార పార్టీ క‌నుస‌న్న‌ల్లో పోలీసులు చెల‌రేగిపోతుండ‌డాన్ని స్థానికులు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు.