Begin typing your search above and press return to search.

ప‌ళ‌ని స్వామి నిజంగా... ఆద‌ర్శ ముఖ్య‌మంత్రే!

By:  Tupaki Desk   |   24 Feb 2017 9:16 AM GMT
ప‌ళ‌ని స్వామి నిజంగా... ఆద‌ర్శ ముఖ్య‌మంత్రే!
X
త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత అకాల మ‌ర‌ణం - ఆ త‌ర్వాత సీఎం పీఠ‌మెక్కిన ప‌న్నీర్ సెల్వం - చిన్న‌మ్మ శ‌శిక‌ళ మ‌ధ్య ఏర్ప‌డ్డ త‌గాదాలు - అనూహ్యంగా శ‌శిక‌ళ‌కు జైలు శిక్ష ఖ‌రారు కావ‌డంతో ఎడ‌ప్పాడి ప‌ళ‌ని స్వామి నిజంగానే అదృష్టం త‌లుపు త‌ట్టింది. అప్ప‌టిదాకా అస‌లు సీఎం రేసులోనే లేని ప‌ళ‌ని... ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చారు. కేవ‌లం గంట‌ల వ్య‌వ‌ధిలో చోటుచేసుకున్న ప‌రిణామాల‌తో ఆయ‌న సీఎం పీఠాన్ని అధిష్టించ‌డం ఖాయ‌మైపోయింది. రోజుల త‌ర‌బ‌డి ప‌న్నీర్‌ - ప‌ళని మ‌ధ్య దోబూచులాడిన సీఎం కుర్చీ చిర‌వ‌కు చిన‌మ్మ విధేయుడిగా తెర‌పైకి వ‌చ్చిన ప‌ళనిస్వామినే వ‌రించింది.

అదాటుగా అందివ‌చ్చిన సీఎం ప‌ద‌విని ప‌ళ‌ని ఎలా నిర్వ‌హిస్తారోన‌ని అంతా అనుమాన‌ప‌డ్డారు. అయితే అంద‌రికంటే కూడా ఆద‌ర్శంగా ప‌నిచేయ‌గ‌ల‌న‌ని ప‌ళ‌ని నిరూపిస్తున్నారు. ఒకటి - రెండు ఘ‌ట‌న‌లు కాదు... ఏకంగా వరుస పెట్టి వెలుగుచూస్తున్న ఈ ఘ‌ట‌న‌ల‌తో ప‌ళ‌ని... ఆద‌ర్శ సీఎంగా నిలుస్తార‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి. ప‌ళ‌ని ఆద‌ర్శ పాల‌న‌కు నిద‌ర్శనంగా నిలుస్తున్న ఘ‌ట‌న‌ల్లో ఇప్ప‌టిదాకా వెలుగుచూసిన వాటిని ఓ సారి ప‌రిశీలిద్దాం.

ఇప్పటికే స్కూటీల కొనుగోలుపై రాయితీ, గర్భిణులకు ఆర్థికసాయం పెంపు - నిరుద్యోగులకు భృతి పెంపు వంటి నిర్ణయాలతో.. ప్రజల్లో నెలకొని వున్న అసంతృప్తిని తగ్గించిన ఎడప్పాడి.. తాజాగా అన్ని శాఖల నుంచి తన వద్దకు వచ్చే ఫైళ్లను ఒక్కరోజులోనే క్లియర్‌ చేయాలని నిర్ణయించారు. పాలనలో ఎలాంటి అవాంతరాలు నెలకొనకుండా సాఫీగా సాగిపోయేందుకు అనువుగా వెంటనే ఫైళ్లను క్లియర్‌ చేయాలని సీఎం కార్యాలయాన్ని ఆదేశించారు. అంతేగాక సమయం వృధా కాకుండా వుండేందుకు అనువుగా ఇక నుంచి మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లకుండా తన కార్యాలయంలోనే ముగించాలని నిర్ణయించుకున్నారు.

అంతేగాక తను ప్రయాణించే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా నిలబడే పోలీసు విధానానికి స్వస్తి పలికారు. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో పోలీసులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి పహారా కాస్తుంటారు. దీంతో కనీసం 500 మంది పోలీసులు సీఎం భద్రత కోసం సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఈ విధానానికి స్వస్తి పలకాలని సీఎం నిర్ణయించారు. ఇకనుంచి తను ప్రయాణించే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా పోలీసులు నిలబడాల్సిన అవసరం లేదని, ఆ సమయంలో వారికి ప్రజాసమస్యలకు సంబంధించిన పనులు అప్పగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనిపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/