Begin typing your search above and press return to search.

ర‌విప్రకాశ్‌ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...విచార‌ణ నేటికి వాయిదా

By:  Tupaki Desk   |   11 Jun 2019 2:16 AM GMT
ర‌విప్రకాశ్‌ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...విచార‌ణ నేటికి వాయిదా
X
టీవీ9 మాజీ సీఈఓ ర‌విప్ర‌కాశ్ కేసు మ‌లుపులు తిరుగుతోంది. టీవీ9 సంస్థ‌కు సంబంధించి మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడటంతో పాటుగా నిధుల మ‌ల్లింపున‌కు పాల్ప‌డినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడం - సైబ‌ర్ క్రైమ్ పోలీసులు ద‌ర్యాప్తు జ‌ర‌ప‌డం - అనంత‌రం కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విచార‌ణ తాజాగా మంగ‌ళ‌వారానికి వాయిదా ప‌డింది. ఈ కేసులో ఇవాళ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ర‌విప్ర‌కాశ్ త‌ప్పుడు వాద‌న‌లు వినిపిస్తున్నార‌ని, నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించార‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాది పేర్కొన్నారు.

ఏబీసీఎల్‌- అలంద మీడియాకు జరిగిన షేర్ల కొనుగోలు వివరాలను ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు వివరిస్తూ ...రవిప్రకాష్ 9 శాతం ఉన్న తన షేర్లలో 40 వేల షేర్లను రూ.20 లక్షలకు హీరో శివాజీకి చెల్లించినట్లు తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించారని అన్నారు. నిజానికి ఫిబ్రవరి 2018న రవిప్రకాష్ ఎలాంటి షేర్లను శివాజీకి కొనుగోలు చేయలేదని చెప్పారు. పోలీసులు సోదాలు చేసినప్పుడు తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి షేర్లను కొనుగోలు చేసినట్టు తెలిసిందన్నారు. ``40 వేల షేర్లను శివాజీకి రూ.20 లక్షలకు అమ్మితే ఇద్దరూ ఐటీకి లెక్కలు చూపించాలి కదా. ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు ఐటీకి చూపించలేదు. మెజారిటీ షేర్ ఓల్డర్స్ కు తెలియకుండా రూ.99 వేలకు టీవీ9 లోగోను అమ్మివేశాడు. కంపెనీ నాది నా ఇష్టం అని పోలీసుల విచారణలో తెలిపాడు. ఎన్‌ సీఎల్‌ టీలో శివాజీ చేత రవిప్రకాష్ కావాలనే కేసులు వేయించాడు. మెజార్టీ షేర్ హోల్డర్స్ తెలియకుండానే రవిప్రకాష్ మీడియా నెక్స్ట్ కు నిధులు మళ్లించారు. పోలీసులు ఎన్నిసార్లు విచారణకు హాజరు కావాలని పిలిచినా హాజరు కాకుండా తప్పించుకున్నారు. తప్పు చేయక పోతే రవిప్రకాష్ ఎందుకు పోలీసుల విచారణకు హాజరు కాలేదు. శివాజీ అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చాం. కానీ పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పోలీసుల ముందు రవిప్రకాష్ హజరయ్యారు. పోలీసులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు రవిప్రకాష్ సమాధానం చెప్పలేదు” అని ప్రభుత్వ తరఫు లాయర్ వాదించారు.

ఇదిలాఉండ‌గా, కేసు మంగ‌ళ‌వారం విచార‌ణ‌కు రానుంది. మ‌రోవైపు, ర‌విప్ర‌కాశ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఫోర్జరీ కేసులో బెయిల్ కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ తిరస్కరణకు గురవ‌డం, ఇప్పటికే రవిప్రకాశ్ కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేసిన క్రమంలో ఆయన అరెస్ట్ తప్పదన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందు నోటీసులు ఇచ్చిన తర్వాతే అదుపులోకి తీసుకోవాలని సుప్రీం పేర్కొనడంతో - సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో - కోర్టు తీర్పును అనుసరించి రవిప్రకాశ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు. మంగ‌ళ‌వారం న్యాయ‌స్థానం వెలువ‌రించే తీర్పును బ‌ట్టి పోలీసులు త‌గు చ‌ర్య‌లు తీసుకోనున్నారు.