Begin typing your search above and press return to search.

కోడి పందాల కామెడీ..కేసులు పెడుతున్న పోలీసులు

By:  Tupaki Desk   |   18 Jan 2018 5:25 AM GMT
కోడి పందాల కామెడీ..కేసులు పెడుతున్న పోలీసులు
X
సంక్రాంతి సంద‌ర్భంగా తెలుగు మీడియాలో హ‌ల్‌ చ‌ల్ చేసిన వార్త ఏదైనా ఉందా అంటే... అవి కోడి పందాల గురించే. కోస్తాలో జోరుగా సాగిన ఈ కోడి పందాల గురించి ప్రింట్ మీడియా - ఎల‌క్ట్రానిక్ మీడియా - డిజిట‌ల్ మీడియా - సోష‌ల్ మీడియా అనే తేడా లేకుండా హోరెత్తించింది. జాతీయ ఛాన‌ల్‌ ల‌లో సైతం జ‌ల్లిక‌ట్టుతో క‌లిపి కోడి పందాల గురించి ప్రచారం సాగింది. అయితే...ఇంత హ‌డావుడి జ‌రిగిన నాలుగురోజుల పాటు స్పందించ‌కుండా...పందాల ముగిసిన రెండ్రోజుల త‌ర్వాత ఏపీ పోలీసులు కేసుల న‌మోదుకు ముందుకు వ‌స్తున్నార‌ని అంటున్నారు.

కోస్తాలోని వివిధ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ ప్ర‌కారం కోడి పందేలపై పాలకుల ద్వంద్వవైఖరికి సామాన్యులు బలవుతున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందాలకు సై అన్న సగటు మనిషి ఆనక పోలీసులు అనుసరిస్తున్న వైఖరితో సరదా తీరిపోతోంది. సంక్రాంతికి పది పదిహేను రోజుల ముందుగానే కోడి పందేలపై అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు కోడి పందేలకు అనుకూలంగా వ్యవహరించారు. తూర్పు గోదావరి జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ పందేలు నిర్వహించారు. ఎంపీలు - ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేల సమక్షంలో అట్టహాసంగా కోడి పందేలు నిర్వహించారు. ముఖ్య నేతల మద్దతు పుష్కలంగా ఉండటం - గతంలో లేని విధంగా ప్రభుత్వం నుండి కోడి పందేలపై సానుకూల ప్రకటనలు రావడంతో పందాలరాయుళ్లు బరి తెగించారు. మరోవైపు సుప్రీంకోర్టు నుండి విడుదలైన ఆంక్షలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే పోలీసుల దాడులు మాత్రం సామాన్యులకే పరిమితమయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దగ్గరుండి కోడి పందాలు ఆడించిన ప్రజాప్రతినిధులు - ముఖ్య రాజకీయ పార్టీల నేతల జోలికి పోలీసులు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే బడాబాబుల వద్ద ప్రాపకం లేని చిన్నా చితకా గ్రామస్థాయి నాయకులు - సంక్రాంతి సంబరాలను ఉత్సాహంగా జరుపుకునేందుకు పట్టణాల నుండి పల్లెలకు వెళ్ళిన వారిపై పోలీసులు కేసులు బనాయిస్తున్నారని వాపోతున్నారు. అది కూడా కీలకమైన భోగి - సంక్రాంతి రోజులను మినహాయించి - మంగళ - బుధవారాల్లో తూర్పు గోదావరి జిల్లాలో కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ముందుకువచ్చారు. ముఖ్యంగా భవిష్యత్తులో సుప్రీంకోర్టు నుండి ఇబ్బంది లేకుండా, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకే చిన్నా చితకా వ్యక్తులపై కేసులు బనాయించి - ఫలానా ప్రాంతంలో ఇన్ని కేసులు నమోదు చేసి, ఇంతమందిని అరెస్టు చేశామని చూపించే పనిలో అధికారులున్నారు. మరోవైపు రాష్ట్ర హోంమంత్రి సైతం అంతా అయిపోయాక కోడి పందేలు ఆడేవారిపై కేసులు నమోదు చేస్తున్నారా? అని డీజీపీని బుధవారం అడిగినట్టు స‌మాచారం. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో బడా పందేల రాయుళ్లకు మినహాయింపునిస్తూ, సామాన్యులపై కేసులు నమోదు చేసే పనిలో పోలీసులున్నార‌ని ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా...కోర్టు ఆదేశాలు ధిక్కరించి కోడి పందేలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి - హోం శాఖ మంత్రి చినరాజప్ప వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కోడి పందేల నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి - గురువారం నుంచి ప్రారంభం కానున్న జిల్లా కలెక్టర్ల సదస్సుకు ఏర్పాట్లపై డీజీపీతో చర్చించామని తెలిపారు.