Begin typing your search above and press return to search.

కేంద్రానికి ఏపీ ఇచ్చిన పోలవరం స్టేటస్ రిపోర్ట్ !

By:  Tupaki Desk   |   29 Sep 2016 5:23 AM GMT
కేంద్రానికి ఏపీ ఇచ్చిన పోలవరం స్టేటస్ రిపోర్ట్ !
X
ఐదున్నర కోట్ల సీమాంధ్రుల ఆశలు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయి.ఈ ప్రాజెక్టు కానీ పూర్తి అయితే అద్భుతమే జరుగుతుందన్న ఆశల్ని పాలకులు కల్పిస్తున్నారు. దశాబ్దాల కిందట మొదలైన పోలవరం ముచ్చట ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరి పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో నిధుల కొరతతో అరకొరగా చేసిన పోలవరానికి.. కేంద్రం నాబార్డు నుంచి నిధుల వరం ఇవ్వటంతో పోలవరాన్ని ఆపే శక్తి అంటూ లేదనే చెప్పాలి. ఇకపై.. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ నాబార్డు ఇవ్వనుంది. ఆ రుణాన్ని కేంద్రమే తీర్చుకుంటానని అధికారికంగా చెప్పిన నేపథ్యంలో.. ప్రాజెక్టును ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా పూర్తి చేయటమే ఏపీ సర్కారు మీద ఉన్న బాధ్యతగా చెప్పాలి.

ఎట్టి పరిస్థితుల్లో 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. సార్వత్రిక ఎన్నికలకు వెళ్లే నాటికి రైతులకు పోలవరం ద్వారా నీళ్లు ఇవ్వాలని.. అదే తమకు సానుకూలంగా మారుతుందని కొండంత ఆశతో ఉన్నారు. ఇందులో భాగంగా విదేశాల నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన యంత్రాలతో పనులు ముమ్మరం చేయటమే కాదు.. ప్రతి సోమవారం ఈ ప్రాజెక్టు మీద ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. తాజాగా పోలవరం ప్ర‌జెంట్‌ స్టేటస్ (ప్ర‌స్తుత ప‌రిస్థితి) గురించి కేంద్రానికి ఏపీ సర్కారు ఒక నివేదిక పంపింది. సాంకేతికాంశాలే ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రాజెక్టు పరిస్థితి ఏలా ఉందన్న విషయాన్ని ఈ నివేదిక‌ ఇట్టే చెప్పేస్తుందని చెప్పాలి. మరి ఆ స్టేటస్ రిపోర్ట్ లో ఏముందన్నవిషయాన్ని చూస్తే..

+ 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఇప్పటివరకూ 40 శాతం మాత్రమే పూర్తి అయ్యింది. 960 మెగావాట్ల విద్యుత్.. 80 టీఎంసీల నీటిని కృష్ణా నదికి తరలించే ఈ ప్రాజెక్టుతో 23.44 టీఎంసీల నీరు విశాఖ నగరానికి తరలి వస్తుంది. 540 గ్రామాల్లోని 28.5 లక్షల మందికి తాగునీరు అందుతుంది. కృష్ణా నదికి తరలించే 80టీఎంసీలలో ఏపీకి 45 టీఎంసీలు.. కర్ణాటకకు 21 టీఎంసీలు.. మహారాష్ట్ర 14 టీఎంసీల నీటిని పొందే వీలుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఎనిమిది సంస్థల నుంచి చట్టబద్ధమైన అనుమతులు లభించాయి. గోదావరి నదిపై పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట గ్రామం వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. డ్యామ్ పొడవు 2454 మీటర్లు కాగా.. గేట్ల పొడవు1128.40 మీటర్లు. 25.72 మీటర్ల ఎత్తైన 48గేట్లు ఉండే ఈ ప్రాజెక్టు 50 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 75.2 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. పూర్తిస్థాయిలో జలాశయం నిండితే 601 చదరపు కిలోమీటర్ల మేర నీళ్లు నిలుస్తాయి.

+ విశాఖకు వెళ్లే ఎడమ కాలువ పొడవు 213.49 కిలోమీటర్లు కాగా.. విశాఖలోని పలు భారీ పరిశ్రమలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందుతుంది. విశాఖ మహానగరంతోపాటు.. రెండు జిల్లాల్లోని గ్రామాలు.. పట్టణాలకు తాగునీరు అందుతుంది. ఇక.. ఎడమకాలవ వరకూ జరిగిన పనులు చూస్తే.. ఇప్పటివరకూ 60 శాతం పనులు పూర్తి అయ్యాయి. ఈ ప్రాజెక్టుకు 10,661.77 ఎకరాల భూమి అవసరం కాగా.. ఇప్పటికి 97.34 శాతం భూసేకరణ పూర్తి చేశారు. ఇక కుడి కాలువ లెక్కలోకి వెళితే.. పొడవు 177.90 కిలోమీటర్లు కాగా.. బండమేరు ఉప నదిలో కలిసి కృష్ణలో కలుస్తుంది. పశ్చిమగోదావరి.. కృష్ణా జిల్లాల్లో 3.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. కాలువ పనులు 80 శాతం మేర పూర్తి అయ్యాయి.

+ 2010 – 11 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు రూ.16,010 కోట్లు కాగా.. ఈ ఏడాది ఆగస్టుకు రూ.8391.86 కోట్లు ఖర్చు చేశారు. ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి 273.53 కోట్లు రావాల్సి ఉంది. తాజాగా ఈ ప్రాజెక్టును జాతీయప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఇప్పటివరకూ రూ.2843.07కోట్లు ఖర్చు చేయగా.. కేంద్రం రూ.1893.07 కోట్లు చెల్లించాల్సి ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సింది మొత్తంగా రూ.2136.6 కోట్లు. డ్యాం.. స్పిల్ వేలతో కూడిన హెడ్ వర్క్ నిర్మాణానికి అవసరమైన భూమిలో 99శాతం పూర్తి అయ్యింది. దీని నిర్మాణ పనుల్ని 2018మార్చి నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. జలాశయం సహా ప్రాజెక్టు కోసం ఇంకా.. 1.05లక్షల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుతో 51,047 కుటుంబాలు.. 1.87లక్షల జనాభా ప్రభావితం అవుతారు. పునరావాస.. సహాయ ప్యాకేజీ కోసం రాష్ట్ర సర్కారు 2004లో రూ.2051.02 కోట్లు కేటాయించగా.. మొదటిదశ 12 గ్రామాల్లో జరిగింది. రెండోదశ 42 గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది పూర్తి అయ్యాక మూడోదశలో 46 గ్రామాల్లో పునరావాస చర్యలు చేపడతారు. ముంపునకు గురయ్యే ఏడాది ముందు నాలుగో దశలో 268 గ్రామాల్లో పునరావాస చర్యల్ని చేపడతారు.

+ ఈ ప్రాజెక్టు కారణంగా ఒడిశా.. ఛత్తీస్ గఢ్ లలో ముంపు నివారణకు శబరి.. సీలేరు నదులకు భారీ కరకట్టలు నిర్మించనున్నారు. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల్లోనూ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉంది. అది ఇంతవరకూ జరగలేదు. ఈ ఇష్యూ తేలేవరకూ ప్రాజెక్టు నిర్మాణం అపాలంటూ 2011 ఫిబ్రవరి 8న కేంద్ర పర్యావరణ.. అటవీ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేయగా.. నిర్మాణం ఆపాలన్న ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ.. ఇప్పటికప్పుడు గడువు పొడిగిస్తున్నారు. ఇప్పుడు పొడిగించిన గడువు 2017 జులై 2 వరకు పెంచారు.

+ ఈ ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే 51,047 కుటుంబాలకు 50,787ఇళ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటివరకూ 2,859 ఇళ్లు పూర్తి చేసి 2,754 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. 1,87,187 మందిలో 8,727 మందికి పునరావాసం కల్పించారు. మొత్తం 334 పునరావాస సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకూ నిర్మించినవి 11 మాత్రమే. పునరావాసం కోసం ఇప్పటివరకు పెట్టిన ఖర్చు రూ.304.42 కోట్లు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 90ప్రకారం పోలవరానికి కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది.ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీని కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/