Begin typing your search above and press return to search.

ఎండిపోవటంపై పోచారం కన్ఫర్మేషన్

By:  Tupaki Desk   |   28 Aug 2016 5:53 AM GMT
ఎండిపోవటంపై పోచారం కన్ఫర్మేషన్
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అని ఎవరినైనా అడిగితే.. మంచిగ ఉందిగా అన్న సమాధానం చటుక్కున వస్తుంది. కాస్త ఆలోచించి చెప్పొచ్చుగా అని చనువుగా అడిగితే.. అంటే.. బాగలేదని చెప్పాలా? అన్న ప్రశ్న బుల్లెట్ మాదిరి దూసుకొస్తుంది. అందుకేనేమో.. తెలంగాణలోని వాస్తవ పరిస్థితి గురించి మాట్లాడటానికి చాలామంది ఎక్కువగా ఇష్టపడటం లేదని.. మీడియా సైతం మౌనంగా ఉంటుందన్న విమర్శ ఉంది. నిష్ఠూరంగా ఉన్నప్పటికి ఇదే నిజమని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి నోటి నుంచి తాము రీడిజైన్ చేసే ప్రాజెక్టుల గురించి.. అవన్నీ అందుబాటులోకి వస్తే.. భవిష్యత్ ఎంత బంగారుమయంగా ఉంటుందన్న మాటల గురించే కానీ.. ఇప్పటికిప్పుడు తెలంగాణలోని లక్షలాది ఎకరాలు ఎండిపోతున్న వైనం గురించి మాత్రం ప్రస్తావించరు. భవిష్యత్ లో వచ్చే బిర్యానీ మాటలే తప్పించి.. ఇప్పుడున్న కారపు మెతుకుల గురించి అస్సలు ప్రస్తావించని దుస్థితి.

దీంతో.. భవిష్యత్ వైపు ఆశగా చూస్తూ.. వర్తమానాన్ని వదిలేసిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నోటి నుంచి తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితి బయటకు వచ్చింది కానీ.. అదే లేకుండా ఆ వాస్తవాలు వార్తగా రావాలంటే కష్టమన్న మాట వినిపిస్తోంది. తెలంగాణలో 90లక్షల ఎకరాల్లో సాగుకు పంటను వేస్తే.. అందులో ఇప్పటివరకూ 5 లక్షల ఎకరాలకు పైగా ఎండిపోయిన విషయాన్ని మంత్రి పోచారం తేల్చి చెప్పటాన్ని చూస్తే.. తెలంగాణలో పరిస్థితులు ఎంత గడ్డుగా ఉన్నాయో ఇట్టేఅర్థమవుతుంది.

మంత్రినోటి నుంచే 5 లక్షల ఎకరాల మాట వస్తే.. వాస్తవంలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని కొట్టి పారేయలేం. అంతేకాదు.. రానున్న వారం వ్యవధిలో కానీ వర్షాల కురవకుంటే.. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందన్నమాటను రైతుల నోట వినిపిస్తోంది.ఇదిలా ఉంటే భూగర్భ జలాలు అడుగంటిన వేళ.. ఇప్పటికిప్పుడు భారీగా వర్షాలు కురిస్తే తప్పించి ఏ విధంగానే పరిస్థితులు మారే అవకాశం కనిపించటం లేదు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పుణ్యమా అని రానున్న మూడు నాలుగు రోజుల్లో వర్షాలు కురుస్తాయన్న అంచనాలు ఉన్నాయి. అది నిజమై.. వర్షాలు పెద్ద ఎత్తున పడితేనే తెలంగాణ రైతాంగానికి ఊరట కలుగుతుందన్నది వాస్తవం. క్షేత్రస్థాయిలో ఇంత తీవ్రమైన పరిస్థితి ఉన్నా.. అన్నదాత కష్టాన్ని కళ్లకు కట్టేలా మీడియా ఎందుకు మాట్లాడటం లేదన్నది ప్రశ్న. మంత్రి పోచారం పుణ్యమా అని ఇప్పటికైనా కరవు తీవ్రత బయటకు వచ్చిందనే చెప్పాలి. వరాల దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కోరకుండానే వరాలు ఇస్తారు. మరి.. లక్షలాది ఎకరాల్లో పంట ఎండిన నేపథ్యంలో అన్నదాతలకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయనుందన్న విషయాన్ని ఇప్పటివరకూ ఎందుకు చెప్పనట్లు..? ఇంతకీ వరాల దేవుడికి ఎండిన పంట దృష్టికి వచ్చిందా..?