Begin typing your search above and press return to search.

రాజయ్యతో మాట్లాడిన మహిళ.. అదృశ్యం..!

By:  Tupaki Desk   |   23 Sep 2018 6:00 AM GMT
రాజయ్యతో మాట్లాడిన మహిళ.. అదృశ్యం..!
X
రాజకీయ ఆదిపత్య క్రీడలో ఓ మహిళ పావుగా మారింది. ఆ మహిళతో రాసలీలల సంభాషణలు పలికినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న తాజామాజీ ఎమ్మెల్యే అభాసుపాలయ్యాడు. ఎమ్మెల్యే సీటు కేంద్రంగా బయటపెట్టిన ఆ ఆడియో సంచలనం సృష్టించింది. మొత్తంగా ఈ వ్యవహారం బయటపడ్డాక అందరూ బాగానే ఉన్నారు. కానీ ఆ మహిళ మిస్ అయ్యింది.. ఇంతకీ ఆ మహిళ ఇప్పుడు ఎక్కడుంది.? ఏం చేస్తుంది.? అనేది హాట్ టాపిక్ గా మారింది.

స్టేషన్ ఘన్ పూర్ తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గొంతును పోలిన ఓ ఆడియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజయ్య ఓ మహిళతో మాట్లాడినట్టు ఉన్న ఆ ఆడియో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. అయితే ఆ ఆడియోలో మాట్లాడిన మహిళ ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఇటీవల కొందరు జర్నలిస్టులు ఆ మహిళ ఆచూకీ తెలుసుకుందామని వారి తల్లిదండ్రులను సంప్రదించగా.. తమకు తెలియదని.. ఎక్కడికో వెళ్లిపోయిందని సమాధానమిచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరు దిగ్గజ నేతల మధ్య సాగుతున్న పోరులో ఈ ఆడియో క్లిప్ లో ఉన్న మహిళ కీలక సాక్ష్యం కావడంతో ఈమె ఇప్పుడు సడన్ గా మాయమవడం హాట్ టాపిక్ గా మారింది.

*ఆమె ఎవరు..? బ్రాక్ గ్రౌండ్ ఏంటి.?

ఆడియో క్లిప్ లో ఉన్న మహిళ భర్తతో విభేదించి ఒంటరిగా ఉంటున్నట్టు తెలిసింది. ఆమె నిరుపేద కావడం.. ఆర్థిక సమస్యలు ఉండడంతో ఇలా పక్కదారి పట్టినట్టు తెలిసింది. కళ్యాణ లక్ష్మి పథకంలో డబ్బులు ఇప్పిస్తారని టీఆర్ఎస్ దిగువ శ్రేణి నాయకులను ఆమె కలిసింది. ఆమె ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకొని ఆమె జీవితంతో నాయకులు ఆడుకున్నట్లు తెలిసింది. ఆమెకు మండల స్థాయిలో ఓ పోస్టు ఇస్తామని చెప్పి.. ఆమెను లోబరుచుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత ఈమె స్థానిక నేతల నుంచి పై స్థాయి ఎమ్మెల్యే అభ్యర్థుల వరకూ పరిచయాలు పెంచుకొని వారితో సంభాషణలు సాగించేదట.. ఆ కోవలోనే ఆమె తాజా మాజీ ఎమ్మెల్యే అభ్యర్థితో మాట్లాడినట్టు ఉన్న ఆడియో బయటకు వచ్చింది. దీన్ని ఆమెతో పరిచయం ఉన్న సోమదేవరపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 8 నెలల క్రితం ఆమె ఫోన్ లోంచి కాపీ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అక్కడి నుంచి వాయిస్ రికార్డ్ బయటకు వచ్చినట్టు చెబుతున్నారు.

*మహిళ ఆడియోను ఉపయోగించి రాజయ్య టార్గెట్

తాజామాజీ ఎమ్మెల్యే రాజయ్యకు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ దక్కడంతో నియోజకవర్గంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ తో కొంత కాలంగా నిరసనలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజయ్యను అభాసుపాలు చేయాలనే ఈ ఆడియో క్లిప్పింగ్ బయటపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆడియో క్లిప్ బయటకు రాగానే సదురు ఆడియోలో ఉన్న మహిళ హన్మకొండకు వెళ్లినట్టు చెబుతున్నారు. అప్పటి నుంచి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో ఈమెను రాజయ్య వర్గం దాచేసిందా.. ఆమెతో రాజయ్యది ఆ గొంతు కాదా అని చెప్పిస్తారా.? లేక సాక్ష్యంగా ఉపయోగపడుతుందని కడియం శ్రీహరి వర్గీయులు రహస్యంగా ఉంచారా అన్నది తెలియరావడం లేదు. దీనిపై పోలీస్ యంత్రాంగం స్పందించి ఆ మహిళను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.