Begin typing your search above and press return to search.

పొద్దుతిరుగుడు నేత‌ల‌తో జాగ్ర‌త్త అంటున్న సీనియ‌ర్‌

By:  Tupaki Desk   |   24 May 2016 9:27 AM GMT
పొద్దుతిరుగుడు నేత‌ల‌తో జాగ్ర‌త్త అంటున్న సీనియ‌ర్‌
X
తెలుగుదేశం పార్టీ బ‌లోపేతం కోసం అంటూ ఆ పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేప‌డుతున్న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పార్టీ నేత‌ల‌ను పూర్తిస్థాయిలో ఆక‌ట్టుకోవ‌డం లేదా? వారిలో ఇంకా అసంతృప్తి జ్వాల‌లు ర‌గులుతున్నాయా? స‌ంద‌ర్భానుసారం వాటిని వ్య‌క్తీకరిస్తున్నారా? జిల్లాల్లో జ‌రుగుతున్న మినీమ‌హానాడులు ఇందుకు వేదిక‌గా నిలుస్తున్నాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

తాజాగా అనంత‌పురం జిల్లా క‌ళ్య‌ణదుర్గంలో నిర్వ‌హించిన మినీమ‌హానాడులో టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు అద్ధం ప‌డుతున్నాయి. పార్టీ శ్రేణుల‌ను ఉద్దేశించి కేశ‌వ్ మాట్లాడుతూ పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడు ఎటువైపు ఉంటే అటు ఎలా తిరుగుతుందో.. రాజకీయాల్లో కూడా పొద్దుతిరుగుడు నేతలు ఉంటారనీ చెప్పారు. అలాంటి వారు అధికారం ఎక్కడుంటే అక్కడ చేరతారనీ.. స‌ద‌రు నాయ‌కుల‌ను జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాజ‌కీయాల్లోకి వ్యాపారం కోసం రాలేదని, ప్రజా సేవ కోసం వచ్చిందన్నారు. ఈ తీరును పార్టీలోని నేత‌లంతా గుర్తుంచుకోవాల‌ని సూచించారు. సినీన‌టుడు చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌పుడు - వైఎస్ జ‌గ‌న్ వైకాపా పెట్టినపుడు జిల్లా తెదేపా నాయకులు వాటిలోకి వెళ్లలేదని అన్నారు. అది టీడీపీ నేత‌ల చిత్త‌శుద్ధి అని తెలిపారు. వైఎస్ జగన్‌ వైకాపా ద్వారా తన అవినీతి సొమ్ము రూ.లక్ష కోట్లను కాపాడుకుంటూ, ఇంకా సంపాదించుకోవాలని అనుకున్నాడన్నారు. త్వరలో ఆ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పారు.