Begin typing your search above and press return to search.

పీకే టార్గెట్ 2024.... రేపు కొత్త కమిటీల ప్రకటన

By:  Tupaki Desk   |   23 Jun 2019 2:40 PM GMT
పీకే టార్గెట్ 2024.... రేపు కొత్త కమిటీల ప్రకటన
X
తాజా ఎన్నికల్లో కొత్తగా పోటీకి దిగిన జనసేనకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ దెబ్బకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోవడం ఖాయమన్న విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే గతంలో ప్రకటించిన మాదిరిగానే... తానేమీ రాజకీయాల నుంచి పారిపోవడం లేదని పవన్ తాజాగా తేల్చేశారు. తాజా ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైనా... 2024 ఎన్నికలే లక్ష్యంగా పవన్ పావులు కదుపుతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా ముగిసిన ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల పోటీ చేయగా... ఆ పార్టీ అభ్యర్థులు ఏకంగా 130కి పైగా స్థానాల్లో పోటీ చేశారు. అయితే తాను పోటీ చేసిన రెండు చోట్ల కూడా పవన్ ఓడిపోగా, పార్టీ తరఫున ఒకే ఒక్కరు గెలిచారు. దీంతో పవన్ ఈ దెబ్బకు తిరుగు టపా కట్టడం ఖాయమేనన్న వాదనలు వినిపించాయి.

అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకునేది లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న పవన్... రేపు కీలక నిర్ణయాలను వెలువరించనున్నారు. 2024లో జరగనున్న ఎన్నికలే లక్ష్యంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి పటష్ఠం చేసే దిశగా కీలక నిర్ణయాలను వెలువరించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన పవన్... రేపు పార్టీకి సంబంధించిన కీలక కమిటీలతో పాటు పలు కొత్త కమిటీలను కూడా ప్రకటించనున్నారట. ఈ మేరకు జనసేన కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించింది. గతంలో పార్టీలో కీలక నిర్ణయాలను తీసుకునే కమిటీగా పేరున్న పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) మేథావులు, రాజకీయంగా అనుభవం ఉన్న వారితో ఏర్పాటు చేయగా... ఇప్పుడు అదే కమిటీని పునర్మించనున్నట్లుగా సమాచారం.

ఈ కమిటీతో పాటుగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ, రాజధాని అమరావతి ప్రాంతంలో పార్టీని మరింతగా క్రియాశీలం చేసేందుకు కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) మానీటరింగ్ కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది మానిటరింగ్ కమిటీ.. ఇలా ప్రతి అంశంలోనూ పార్టీకి మరింత పట్టును సాధించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఇక రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు ప్రత్యేకంగా కమిటీలను వేసి పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా పవన్ కీలక ప్రకటనలు చేయనున్నారట. ఈ కమిటీల ప్రకటనను పవన్ మంగళగిరి పరిధిలోని పార్టీ కార్యాలయం నుంచే ప్రకటిస్తారట. మొత్తంగా ఓటమిపై అప్పుడే ఓ మోస్తరు విశ్లేషణ చేసుకున్న పవన్... 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ కమిటీలను ప్రకటించనున్నట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి.