Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ సెటైర్‌..ఆ మీడియా పెద్ద‌కు సంస్కారం వ‌డ్డించండి

By:  Tupaki Desk   |   24 April 2018 4:24 AM GMT
ప‌వ‌న్ సెటైర్‌..ఆ మీడియా పెద్ద‌కు సంస్కారం వ‌డ్డించండి
X
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. కొంతమంది వ్యక్తులు..మీడియాను టార్గెట్ చేస్తూ ఆయన ట్వీట్స్ చేస్తుండడం కలకలం రేపుతున్నాయి. తన తల్లిని దూషించిన వారు రహస్యంగా క్షమాపణలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే. పబ్లిక్‌లో నోటికొచ్చినట్లు తిట్టి... ప్రైవేట్‌గా క్షమాపణలు చెబుతున్నారన్నారు. మనల్ని, మన తల్లుల్ని, ఆడపడుచులను తిట్టే పేపరు ఎందుకు చదవాలి ? వాళ్ల టీవీలను ఎందుకు చూడాలి ? అన్నారు. జర్నలిజం విలువలతో ఉన్న చానెల్స్‌, పత్రికలకు మద్దతిస్తామన్నారు. తాజా ట్వీట్‌లో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌ను నేరుగా టార్గెట్ చేశారు.

క్యాస్టింగ్ టచ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు..ఆయన వ్యాఖ్యల వెనుక తానున్నట్లు దర్శకుడు రాంగోపాల్ పేర్కొన్నట్లు వీడియో టాలీవుడ్ లో పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పవన్ నేరుగా ఫిలిం ఛాంబర్ వద్దకు వెళ్లి నిరసన తెలియచేశారు. తన తల్లిని తిట్టిన వారిపై...పదే పదే ప్రసారం చేసిన ఛానెళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అప్పటి నుండి పవన్ ట్విట్టర్ లో ట్వీట్స్ పెడుతున్నారు. తాజాగా కొన్ని ట్వీట్స్ చేశారు. తాజాగా ఆర్కేను ఉద్దేశిస్తూ ఆయ‌న త‌న‌యుడికి స‌ల‌హా ఇచ్చారు.

ఆర్కే దంప‌తులు, -ఆయ‌న కుమారుడు ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన ప‌వ‌న్‌..`బాబు నాన్న‌గారికి రాత్రి భోజనంలో అన్నం - కూర‌ - ప‌ప్పుతో పాటుగా కొంచెం సంస్కారం కూడా వ‌డ్డించ‌మ‌ని చెప్ప‌రా. అలాగే సంస్కార‌వంత‌మైన స‌బ్బుతో త‌ల‌స్నానం చేయ‌మ‌ని చెప్పండి.గుడ్ నైట్` అంటూ స‌ల‌హా వంటి సెటైర్ పోస్ట్ చేశారు. త‌ద్వారా మీడియా త‌న‌ను కెలికితే...త‌నూ అదే రీతిలో రియాక్ట్ అవుతానంటూ ప‌వ‌న్ చాటిచెప్పారు. అదే స‌మ‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఆర్కేపై ఎవ‌రూ చేయ‌నంత ఘాటు విమ‌ర్శ‌ను ప‌వ‌న్ చేశారు.