Begin typing your search above and press return to search.

ఫిలిం ఛాంబ‌ర్లో ప‌వ‌న్ ఏం చేస్తున్నారు?

By:  Tupaki Desk   |   20 April 2018 8:38 AM GMT
ఫిలిం ఛాంబ‌ర్లో ప‌వ‌న్ ఏం చేస్తున్నారు?
X
గురువారం రాత్రి నుంచి వ‌రుస పెట్టి ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రోజు ఉద‌యం ఫిలింన‌గ‌ర్ లోని ఫిలింఛాంబ‌ర్ వ‌ద్ద‌కు చేరుకోవ‌టం తెలిసిందే. త‌న‌పై జ‌రుగుతున్న కుట్ర‌ను రివీల్ చేసిన ఆయ‌న‌.. త‌న‌కు వ్య‌తిరేకంగా కొన్ని మీడియా ఛాన‌ళ్ల స‌హ‌కారంతో త‌న‌ను బ‌ద్నాం చేస్తున్న‌ట్లుగా ఆయ‌న ఆరోపించారు.

ఈ కుట్ర‌లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు లోకేశ్ ఉన్న‌ట్లుగా చెప్పిన ప‌వ‌న్‌.. గ‌డిచిన ఆర్నెల్లుగా త‌న‌పై మీడియాలో దాడి చేస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. కొన్ని ప్ర‌ముఖ మీడియా ఛాన‌ళ్ల ఆస‌రాతో రూ.10కోట్ల ఖ‌ర్చుతో త‌న‌పై కుట్ర జ‌రుగుతుంద‌ని.. ఇందులో భాగంగానే త‌న త‌ల్లిని దారుణంగా అవ‌మానించారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉద‌యం ఫిలింఛాంబ‌ర్‌కు వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ మా పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. త‌న‌పై జ‌రుగుతున్న‌కుట్ర‌పై స్పందించాల‌ని.. లేనిప‌క్షంలో దీక్ష‌కు దిగుతాన‌ని వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. సినీ పెద్ద‌ల్ని ఫిలింఛాంబ‌ర్‌కు రావాల‌ని కోరిన ప‌వ‌న్‌.. త‌న వెంట లాయ‌ర్ల‌ను ఉంచుకొని వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

త‌న త‌ల్లి విష‌యంలో జ‌రిగిన దుర్మార్గ‌మైన కుట్ర‌పై మా స్పందిస్తుందా? లేదంటే.. తానే కార్యాచ‌ర‌ణ చేప‌ట్టాలా? అంటూ ప్ర‌శ్నిస్తున్న ప‌వ‌న్‌.. త‌న త‌ల్లికి న్యాయం జ‌రిగే వ‌ర‌కూ ఛాంబ‌ర్ ను విడిచి పెట్ట‌నంటూ తేల్చి చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

దీనికి త‌గ్గ‌ట్లే ఛాంబ‌ర్ రెండు వైపులా త‌లుపులు వేసుకొని లోప‌ల కూర్చున్న ప‌వ‌న్‌.. నిర‌స‌న కొన‌సాగిస్తూ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లుగా చెబుతున్నారు. ఫిలింఛాంబ‌ర్ కు ప‌వ‌న్ చేరుకున్న విష‌యాన్ని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్క‌డ‌కు చేరుకున్నారు. ఎల్లో మీడియా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఒక ద‌శ‌లో తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న వారు ఫిలింఛాంబ‌ర్ లోప‌ల‌కు దూసుకెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌గా.. వారిని బ‌ల‌వంతంగా నిలువ‌రించారు.

కొన్ని మీడియా ఛాన‌ళ్ల‌ను తిడుతూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. లోకేశ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయ‌టంతో పాటు.. ప్ర‌ముఖ టీవీ ఛాన‌ళ్ల‌పై తిట్ల దండ‌కాన్ని అందుకున్నారు.

సినీ పెద్ద‌లు ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద‌కు రావాల‌ని కోర‌టంతో పాటు..వ‌ర్మ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌వ‌న్ గ‌ట్టిగా కోరుతున్న‌ట్లుగా తెలుస్తోంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో సినీ ప‌రిశ్ర‌మ ప‌వ‌న్ కు బాస‌ట‌గా నిలిచింది. ఆయ‌న‌కు న్యాయం జ‌ర‌గాల‌న్న డిమాండ్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. మెగా క్యాంప్ కు సంబంధించి నటులంతా ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. మెగాస్టార్ చిరుకూడా రావాల్సి ఉంది. మ‌రికాసేప‌ట్లో ఫిలిం చాంబ‌ర్ వ‌ద్ద‌కు వ‌స్తార‌ని చెబుతున్నారు. సినీ రంగం ప‌వ‌న్ కు బాస‌ట‌గా నిలుస్తుంద‌ని పూరీ ట్వీట్ చేయ‌గా.. మ‌రో సినీ ప్ర‌ముఖుడు కేఎస్ రామారావు మా్ట్లాడుతూ.. వ‌ర్మ‌ను వేస్ట్ ఫెలోగా అభివ‌ర్ణించారు.