Begin typing your search above and press return to search.

పవన్ 30 రోజుల పాలిటిక్స్: నేలవిడిచి సాము

By:  Tupaki Desk   |   13 Jun 2018 5:26 AM GMT
పవన్ 30 రోజుల పాలిటిక్స్: నేలవిడిచి సాము
X
పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ ముగిసింది. దాదాపు 30 రోజుల పాటు ఉత్తరాంద్ర మూడు జిల్లాల్లో పర్యటించిన పవన్ పలు ఉద్వేగ, విమర్శనాత్మక విమర్శలు చేశారు. ఇక్కడి చరిత్రను కొనియాడారు. ముప్పై రోజుల పాటు శ్రీకాకుళం - విజయనగరం జిల్లాలు - అరకు ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కొద్దిగా విరామం ఇచ్చి హైదరాబాద్ చేరుకున్నారు.

30రోజుల పర్యటనలో పవన్ జనంతో కలిసిపోయారు. వారి కష్టాలను విన్నారు. ఈ సందర్భంగా ప్రజాసమస్యలపై స్పందించి నిలదీశారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే ఉత్తరాంధ్ర స్ఫూర్తిని దెబ్బతీసేలా ఆయన చేసిన వ్యాఖ్యలపైనే ఈ ప్రాంత ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తరాంధ్ర.. ఎంతో మంది విప్లవ - మేధావి వర్గాలకు పుట్టినగడ్డ. ఇక్కడి ప్రజల్లో చైతన్యం ఎక్కువ. కష్టజీవులుగా పేరొంది. ఈ గడ్డ మీద పర్యటించిన పవన్ కళ్యాణ్ తనకు తెలంగాణ స్ఫూర్తి కనిపించిందంటూ చెప్పడం ఈ ప్రాంత వాసులకు గిట్టలేదు. తమ పోరాటాలకు అస్తిత్వాలకు తెలంగాణతో పోల్చడం విలువైనదిగా ఈ ప్రాంత ప్రజలు భావించడం లేదు. తెలంగాణలో అసలు జనసేన పార్టీయే లేదు. అలాంటప్పుడు అక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు వారిని జనసేనాని స్ఫూర్తిగా తీసుకున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

నిజానికి తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేసి చూడలేం. వారు ఒక్కతాటిపై నిలబడి రాష్ట్రాన్ని సాధించారు. కానీ పవన్ పక్కరాష్ట్రంలో ఉండి రాష్ట్రం విడిపోవడానికి కారణమైన ప్రజలను పొగడడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. బాధితులకు స్ఫూర్తిగా బాధించిన వారిని చూపించడంపైనే ఉత్తరాంద్ర ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పవన్ మాటలు ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసాయంటూ పలువురు నాయకులు విమర్శిస్తున్నారు.

నిజానికి రాజకీయ నాయకులందరూ ప్రజల కష్టాలను దూరం చేయడానికి ఏం చేస్తాం.. ఆ ప్రాంతానికి నిధులు - అభివృద్ధి పనులు చేస్తామంటూ హామీలు ఇవ్వాలి. అభివృద్ధి - సంక్షేమం - నిధులు - ఉద్యోగాలు ప్రాతిపదికగా పర్యటన సాగాలి. కానీ పవన్ ఎంత సేపు విమర్శలు - పక్క రాష్ట్రం విషయాలు - తనకు జరిగిన మోసాలపై ప్రసంగిస్తూ పోయారు. తప్పితే క్షేత్రస్థాయిలో తాను ఏం చేయబోతాననే విషయాలు చెప్పలేదు. ఇప్పుడు 30 రోజులు పూర్తయిన తర్వాత అయినా పవన్ ఈ విషయాన్ని గమనిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.