Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ప‌ర్య‌టన‌..అభిమానులే హ‌ర్ట్ అవుతున్నారుగా

By:  Tupaki Desk   |   10 Dec 2017 5:18 AM GMT
ప‌వ‌న్ ప‌ర్య‌టన‌..అభిమానులే హ‌ర్ట్ అవుతున్నారుగా
X
జ‌న‌సేన అధినేత - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు రోజుల సుడిగాలి ప‌ర్య‌ట‌న మ‌రోమారు ఆయ‌న‌లోని రాజ‌కీయవేత్త‌ను తెర‌మీద‌కు తెచ్చిన సంగతి తెలిసిందే. డీసీఐ కార్పొరేష‌న్ ఉద్యోగుల‌కు మ‌ద్ద‌తు - ఫాతిమా కాలేజీ విద్యార్థుల‌కు సంఘీభావం - పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంపై సందేహాల నివృత్తి, బోటు ప్ర‌మాద మృతుల కుటుంబాల‌కు భ‌రోసా ఇవ్వ‌డం వంటివి ప‌వ‌న్ టూర్ ముఖ్యాంశాలు. అయితే ప‌వ‌న్ టూర్లో భాగంగా అభిమానుల‌తో జ‌రిపిన స‌మావేశాల తీరుపై ప‌వ‌న్ ఫ్యాన్స్ పెద‌వి విరుస్తున్నారు. ముఖ్యంగా ఒంగోలులో సాగిన స‌మావేశం అయితే ఒకింత హ‌ర్ట్ అవుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఒంగోలులోని ఎ-వన్ కన్వన్షన్‌ హాలులో శనివారం నిర్వహించిన సభ అంతా గందరగోళం మధ్యనే జరిగిందని... ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్ధంకాని అయోమయ పరిస్ధితి ఏర్పడిందని ఒంగోలు వాసులు సోష‌ల్ మీడియా సాక్షిగా వెల్ల‌డిస్తున్నారు. ఎన్‌ టిఆర్ కళాక్షేత్రం నుండి బయలుదేరిన కాన్వాయ్‌ లో పవన్ ప్రజలకు అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంత‌రం అభిమానులు ముందుకు తోసుకుంటూ వేదికపైకి దూసుకువచ్చారు. ఈ సమయంలో కన్వన్షన్‌ హాలులోని ఆక్సిజన్ అందుకు కొంతమంది పవన్ అభిమానులు - పాత్రికేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది ప్రసంగం నడిమధ్యనే బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. కొద్దిమందికి మాత్రమే సభకు అనుమతి ఉందని నిర్వాహకులు ముందుగా ప్రకటించినప్పటికీ వారి అంచనాలు మించి కార్యకర్తలు రావటంతో తోపులాట జరిగింది. ఇదే స‌మ‌యంలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్ధంకాని అయోమయ పరిస్ధితి ఏర్పడింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయటంలో సమస్య సద్దుమణిగింది.

కాగా పవన్ ఒక్కరు మాత్రమే ప్రసంగించారు తప్ప ఏ ఒక్క కార్యకర్తకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోగా కనీసం అభిమానులతో ముచ్చటించటం కాని, దగ్గరకు ఆహ్వానించటం కాని జరగకపోవటంతో అభిమానులు తీవ్ర నిరాశ పడ్డారు. సుదూరప్రాంతాలను అభిమానులు భారీగా తరలివస్తే కనీసం వారిని ఆప్యాయంగా పలకరించలేదన్న వాదన వారినుండి వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో పవన్ సభలో మాత్రం గందరగోళ పరిస్ధితులు చక్కబెట్టడటంలో నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా పవన్ పర్యటన సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు.కాగా పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన విజయవంతం కావటంతో జనసేన పార్టీకార్యకర్తలు ఆనందంలో ఉన్నారు.