Begin typing your search above and press return to search.

తెలుగు వారి ప్ర‌శ్న‌: ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ?

By:  Tupaki Desk   |   27 Feb 2017 11:05 AM GMT
తెలుగు వారి ప్ర‌శ్న‌: ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ?
X
ఇది తెలుగు వారి ప్ర‌శ్న‌. జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ? అగ్ర‌రాజ్యం అమెరికాలో తెలుగువ్య‌క్తిపై తూటాలు పేలి శ‌వంగా మారిపోయినా, ఇళ్ల‌పై దాడులు జ‌రుగుతున్నా...ట్రైన్లలో వేధింపుల ప‌ర్వం జ‌రుగుతున్నా జ‌నసేనాని ఎందుకు జ‌నం త‌రఫున గ‌ళం విప్ప‌డం లేదు? ఆఖ‌రికి త‌న సహ‌జ శైలి అయిన ట్వీట్ కూడా చేయ‌నంత బిజీలో ఉండిపోయారా? తెలుగు ఎన్నారై శ్రీ‌నివాస్ కూచిబోట్ల జాత్యహంకారి తూటాల‌కు బ‌లి కావ‌డానికి వారం ముందే అమెరికాలో ప‌ర్య‌టించి అద్భుత‌మైన ఉప‌న్యాసం ఇచ్చిన ప‌వ‌న్ ఇపుడు ఎందుకు ఆ దేశంలోని దురహంకార దూకుడు చ‌ర్య‌ల‌పై స్పందించ‌డం లేదు అని ఇటు తెలుగు రాష్ర్టాల్లోని ప్ర‌జ‌ల్లో అటు ఎన్నారైల్లో సందేహం నెల‌కొంటోంది.

తాజా ప‌రిస్థితుల‌ను చూస్తుంటే...అమెరికాలో భారతీయుల పట్ల జాత్యాహంకార ధోరణి పెచ్చరిల్లుతోంది. హైదరాబాద్ కు చెందిన కూచిభోట్ల శ్రీనివాస్ హత్యోదంతం మరువక ముందే కొలరడాలోనూ భారతీయ కుటుంబానికి బెదరింపులు మొదలయ్యాయి. అమెరికా విడిచి వెళ్లిపోవాలంటూ అక్క‌డ ఉంటున్న‌ ఓ కుటుంబం నివాసంపై పోస్టర్లు అతికించారు. వారి ఇంటిపై అమెరికన్లు దాడి చేశారు. యాభైకి పైగా పోస్టర్లు అతికించారు. గోధుమ వర్ణం వాళ్లు.. ఇండియన్లు ఇక్కడ ఉండొద్దన్న అర్థం వచ్చేలా ఇంటి మీద నినాదాలు రాసేసిన వారు.. తలుపులు.. కిటికీల మీద కరపత్రాల్ని అతికించేశారు. మరింత దారుణమైన విషయం ఏమిటంటే.. గోడల మీద కోడిగుడ్లను విసిరటంతో పాటు..కుక్కల మలమూత్రాల్ని పూసేయటం సంచలనంగా మారింది.

-తాజాగా న్యూయార్క్ లో లోకల్ ట్రైన్ ప్రయాణిస్తున్న భారతీయ మహిళను ఇద్దరు నల్ల జాతీయులు హేళన చేశారు. అంతేకాకుండా పలు విధాలుగా ఆమెపై అసభ్యకర కామెంట్లు చేస్తూ... తమ దేశం విడిచిపెట్టి పోవాలని బెదిరించారు. తమ దేశం విడిచిపెట్టి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా ఆమెను తీవ్ర భయాందోళనలకు గురి చేసేందుకు యత్నించారు. అయితే ఈ జాత్యహంకారులను భారతీయ మహిళ ధైర్యంగానే ఎదుర్కొన్నారు.

- గత బుధవారం రాత్రి అమెరికాలోని కన్సాస్ సిటీలో దుండగుడి కాల్పుల్లో శ్రీనివాస్ మృతిచెందిన విషయం తెలిసిందే. అమెరికాలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం ఈ రోజు రాత్రికి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది. శ్రీనివాస్ భౌతికకాయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ స‌మ‌యంలో ప‌లువురు తెలుగువారి కోసం ఉన్నాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ స్పంద‌న కోసం ఎదురు చూస్తున్నారు.

ఇంత‌టి ఉద్రిక్త ప‌రిస్థితులు ఉన్న స‌మ‌యంలోనూ జ‌న‌సేనాని స్పందించ‌క‌పోవ‌డంపై పలువురు ఆశ్చ‌ర్య వ్య‌క్తం చేస్తున్నారు. సినిమాలు చేసుకుంటూ రాజ‌కీయాల వైపు దృష్టి సారించిన ప‌వ‌న్ ఇటీవ‌లే సీరియ‌స్‌గా రాజ‌కీయాల‌పై దృష్టి సారించిన‌ట్లు తెలిపి ప‌లు ప్రజా స‌మ‌స్య‌ల‌పై స్పందించారు. అంతేకాకుండా ఇటీవ‌లే ప‌వ‌న్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో పెద్ద ఎత్తున ఎన్నారైల స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ స్పంద‌న కోసం తెలుగు వారు ఎదురుచూడ‌టంలో త‌ప్పేం లేదేమో. ఇంకా చెప్పాలంటే తెలుగువారు చ‌స్తున్నా ప‌వ‌న్ ఎందుకు స్పందించరు అంటూ కొంద‌రు ప్రేమ పూర్వ‌క కోపంలో అర్థం ఉంద‌నే క‌నిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/