Begin typing your search above and press return to search.

బాబుపై పోరాటానికి ప‌వ‌న్‌ కు రైతుల స‌ల‌హాలు

By:  Tupaki Desk   |   22 July 2018 7:32 AM GMT
బాబుపై పోరాటానికి ప‌వ‌న్‌ కు రైతుల స‌ల‌హాలు
X
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఏపీ రాజధాని అమరావతిలో పర్యటన ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాల‌కు వేదిక‌గా మారింది. సుదీర్ఘ‌కాలం త‌ర్వాత రాజ‌ధాని ప్రాంత రైతుల‌తో స‌మావేశం అయ్యేందుకు షెడ్యూల్ పెట్టుకున్న ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా అనూహ్య‌మైన అభిప్రాయాల‌ను ప్ర‌జ‌ల నుంచి వినాల్సి వ‌చ్చింది. అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఉండవల్లి అనంత పద్మనాభస్వామిని ప‌వ‌న్‌ దర్శించుకోవ‌డం - ఆ గ్రామంలోని రైతులతో భేటీ అయేందుకు ప‌వ‌న్ సిద్ధమ‌య్యారు. ఈ క్ర‌మంలో ఉండవల్లిలో రైతులతో పవన్‌ సమావేశయి అక్కడి భూములను పరిశీలించిన సందర్భంగా స్థానిక రైతులు తమ సమస్యలను పవన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా వారు ఒకింత ప‌వ‌న్‌ ను నిలదీశారు. ``మీరు చెప్ప‌బ‌ట్టే చంద్ర‌బాబుకు ఓటువేశాం...మా భూములు అప్ప‌గించాం..కానీ...మా ప్రాంతంలోకి మేం వెళ్లాలంటే...ఆధార్ కార్డు చూపాల్సి వ‌స్తోంది. మా భూములు అప్పగించాల్సిన బాధ్యత మీదేనని చెప్పారు.`` అంటూ ఆక్రోశం వ్య‌క్తం చేశారు.

ఈ స‌మావేశం సంద‌ర్భంగా ఏపీ రాజధాని ప్రాంత రైతులు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లి త‌మ దీన స్థితిని వెల్ల‌డించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్రబాబు చెప్పులు లేకుండా వచ్చి తమను ఓట్లు అడిగారని.. ఇప్పుడు మా భూమలు నుంచి మమ్మల్నే గెంటేస్తున్నారని వాపోయారు. 'భూముల్లో పంటలు పండటం లేదని అధికారులు రికార్డులు సృష్టిస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కొంటున్నారు. పంటలు పండడం లేదని తప్పుడు లెక్కలు సృష్టిస్తున్నా మా భూముల్లోకి వెళ్లడానికి మా ఆధార్‌ చూపించాల్సి వస్తోంది' అని రైతులు వాపోయారు. ``ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 1200 అడుగుల రోడ్డు ఉండవల్లి మీదుగా వేస్తామని తమను వేధించడమే. టీడీపీకి ఓటు వేసినందుకు మాకు ఇది ఫలితం. మీరు చెప్పారనే చంద్రబాబుకు ఆనాడు ఓట్లేశాం. ఇప్పుడు మా పరిస్థితి ఇలా అయ్యింది. మీరే వెళ్లి చంద్రబాబును నిలదీయండి' అని పవన్‌ కల్యాణ్‌ ను కోరారు. దీంతో ప‌వ‌న్ ఒకింత ప‌శ్చాత్తాపంతో రైతుల‌కు స‌మాధానం ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఇంత భూమి తీసుకుంటారని తెలిస్తే తాను వేరేలా ఉండేవాడినని చెప్పారు.బహుళ పంటలు పండే భూములను బీడు భూములుగా చూపడం సరికాదని పవన్‌ అభిప్రాయపడ్డారు. రైతుల ఆవేదన నేప‌థ్యంలో భూసేకరణ చేస్తే ఎదురు తిరగండని రైతులకు సూచించారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోమారు టీడీపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. రాజధాని నిర్మాణానికి అవసరానికి మించి భూ సేకరణ జరుగుతోందని స్ప‌ష్టం చేశారు. దేవుడు గుళ్లో ప్రసాదం మీద ఆధారపడి చాలామంది బతుకుతున్నారని, రైతులకు అటువంటి దుస్థితి రాకుండా చూడాలని అన్నారు. ' రైతులు అభివృద్ధికి అడ్డంకి కాదు. భూమిని నాశనం చేసినా, రైతులను ఏడిపించినా సర్వనాశనం అయిపోతారు' అని అన్నారు. 'కొంతమంది చావులు - ఏడుపులతో కాదు అందరి ఆనందం సంతోషంతో రాజధానిని నిర్మించండి. బషీర్ బాగ్ తరహాలో ఘటన మరొకటి వద్దు' అని ప్రభుత్వానికి పవన్‌ సూచించారు. కొద్ది మంది చేతుల్లోకి సంపద వెళ్తుంటే జనసేన సహించదని పవన్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగం అందరికీ సమన హక్కు ఇచ్చిందని, ఎవరూ ఎవరికి బానిసలు కాదని అన్నారు. 144 సెక్షన్ ఉందని తెలుసుకుని వచ్చానని, అరెస్టుకు కూడా తాను సిద్ధమేని చెప్పారు. రైతు సమస్యలపై తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పవన్‌ స్పష్టం చేశారు.భూసేకరణ జరిగితే తనకు చెప్పమని రైతులకు సూచించారు. తాను కూడా వారితో కలిసి ఆందోళనలో పాల్గొంటానని చెప్పారు. రైతుల భూములను కాపాడడానికి ప్రాణాలివ్వడానికైనా సిద్ధమేనని అన్నారు.

బీజేపీకి నష్టం కలగకూడదనే జనసేన ట్వీట్లు చేసిందని చంద్ర‌బాబు విమర్శించడంపై ప‌వ‌న్ ఘాటుగా స్పందించారు. బీజేపీతో సమానంగా టీడీపీ అంతే దారుణంగా ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. టీడీపీ నేత‌ల‌కు గ‌జినీ సినిమాలో హీరో వ‌లే జ్ఞాప‌క‌శ‌క్తి న‌శించిందేమో. ఒక్కసారి వెనక్కు చూసుకుని మాట్లాడాలని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచించారు. ``చంద్రబాబుగారు..ప్రత్యేక హోదాను ఎవరు నీరుగార్చారు?ప్రధాని మోడీకి టీడీపీ ఎంపీలు పాదాభివందనం చేస్తారు. అదే సభలో బీజేపీని తిడతారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? భవిష్య‌త్‌ లో మళ్లీ మీ వైఖరిని మార్చుకోబోమని గ్యారంటీ ఇవ్వగలరా?`` అని ప్రశ్నించారు. మాట మార్చే విధానం వల్ల ఏపీ ప్రజలను దేశస్థాయిలో నిలకడలేనివాళ్లుగా, అవకాశవాదులుగా, ఆత్మగౌరవం లేని వాళ్లుగా చంద్ర‌బాబు నిలబెట్టారని పవన్ మండిప‌డ్డారు. బీజేపీని వెనుకేసుకొస్తే త‌మకొచ్చే లాభం ఏమిటో చెప్పాలని, రాష్ట్రంలో ఒక్క సీటూ కూడా గెలవలేని బీజేపీని ఎవరైనా వెనుకేసుకొస్తారా అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.