Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కు టీడీపీ వ‌ల్ల ప్రాణ‌హాని ఉంది: జ‌న‌సేన నేత‌

By:  Tupaki Desk   |   25 April 2018 1:24 PM GMT
ప‌వ‌న్ కు టీడీపీ వ‌ల్ల ప్రాణ‌హాని ఉంది: జ‌న‌సేన నేత‌
X
తాను అత్యంత ధీశాలిన‌ని చెప్పుకునే ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు.....తాజాగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో తీవ్ర భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. తాను రాష్ట్రం కోసం కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాన‌ని....ఆ క్రమంలో త‌న‌కు ఎలాంటి ఆప‌ద వ‌చ్చినా.....ప్ర‌జ‌లంతా కాపాడాల‌ని తెగ భ‌య‌ప‌డిపోయారు. కేంద్రం నుంచి ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సిద్ధంగా ఉండాలని ప్ర‌జ‌ల‌కు హిత‌బోధ చేశారు. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణమూర్తి అయితే....మ‌రో అడుగు ముందుకు వేసి ఏకంగా చంద్ర‌బాబుకు ప్రాణ హాని ఉంద‌ని....టీడీపీ అధినేత‌ను అంత‌మొందించేందుకు బీజేపీ కుట్ర‌ప‌న్నుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చంద్ర‌బాబు....బీజేపీని విమ‌ర్శించ‌డం మానుకోవాల‌ని...లేకుంటే మ‌రో అలిపిరి త‌ర‌హా ఘ‌ట‌న‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్న వ్యాఖ్య‌ల‌ను కేఈ ఉటంకించారు. అయితే, బీజేపీని విల‌న్ గా చిత్రీక‌రించేందుకు...ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర సింప‌తీ కొట్టేసేందుకు టీడీపీ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తోంద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అయితే, తాజాగా ఇదే త‌ర‌హాలో జ‌న‌సేనాని ప‌వ‌న్ కు ప్రాణ‌హాని ఉంద‌ని జ‌న‌సేన నేత ఒక‌రు షాకింగ్ కామెంట్స్ చేశారు.

టీడీపీ ప్రోద్బలంతోనే కొన్ని మీడియా చానెళ్లు త‌న‌ను గ‌త ఆరు నెల‌లుగా టార్గెట్ చేశాయ‌ని...ప‌వ‌న్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. టీడీపీకి కొమ్ముకాచే కొన్ని మీడియా చానెళ్ల‌పై తాను సుదీర్ఘ న్యాయ‌పోరాటం చేయ‌బోతున్నాన‌ని...ఆ క్ర‌మంలో త‌న ప్రాణాలు కూడా పోవ‌చ్చ‌ని పవ‌న్ కూడా వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌నసేన నేత‌ - కాపు నాడు ప్రెసిడెంట్ ఎస్. శ్రీ‌నివాస‌రావు ...ప‌వ‌న్ కు చంద్ర‌బాబు - టీడీపీ నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చంద్ర‌బాబు వెన‌కున్న ఎల్లో మీడియా వల్ల‌ ప‌వ‌న్ కు ఏమ‌న్నా జ‌రిగితే అందుకు టీడీపీ ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల‌న్నారు. టీడీపీ అవినీతిని ఎండ‌గ‌డుతోన్న ప‌వ‌న్ పై చంద్ర‌బాబు, లోకేష్ తీవ్ర అస‌హ‌నంతో ఉన్నార‌ని, కోట్ల రూపాయ‌లు కుమ్మ‌రిచ్చి మీడియాను లోకేష్ మేనేజ్ చేస్తున్నార‌ని ఆరోపించారు.