Begin typing your search above and press return to search.

రేపల్లెలో ఆడోళ్లు ప‌వ‌న్ ఫ్లెక్సీ కాల్చేశారు!

By:  Tupaki Desk   |   7 Feb 2016 4:41 PM GMT
రేపల్లెలో ఆడోళ్లు ప‌వ‌న్ ఫ్లెక్సీ కాల్చేశారు!
X
కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ ఏపీలో మొద‌లైన ఉద్య‌మం క్ర‌మంగా ఊపందుకుంటోంది. కాపు నేత‌.. మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చేస్తున్న ఆమ‌ర‌ణ‌దీక్ష‌పై కాపులు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు.కాపులకు న్యాయం చేసే విష‌యంలో చంద్ర‌బాబు స‌ర్కారు ఆశించినంత మేర స్పందించ‌టం లేద‌న్న భావ‌న‌ను వ్య‌క్తం చేస్తున్న వారు తీవ్ర ఆగ్ర‌హానికి గురి అవుతున్నారు.

మ‌రోవైపు త‌మ వ‌ర్గానికే చెందిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పైనా ప‌లువురు కాపులు గుర్రుగా ఉన్నారు. కులం.. మ‌తం లాంటి వాటికి ప‌వ‌న్ దూరంగా ఉంటార‌ని తెలిసినా.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో కాపుల ఇష్యూలో ప‌వ‌న్ మ‌రింత బ‌లంగా త‌న వాణిని వినిపించాల‌ని ఆశిస్తున్నారు. ఎన్నిక‌ల వేళ ప‌వ‌న్ చెప్పారు కాబ‌ట్టే తెలుగుదేశం పార్టీకి తాము ఓట్లు వేశామ‌ని.. ఇప్పుడు కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఆశించినంతగా వ్య‌వ‌మ‌రించ‌క‌పోవ‌ట‌మే కాదు.. ఇప్పుడు కూడా సానుకూలంగా స్పందించ‌టం లేద‌న్న భావ‌న వారిలో వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. గ‌డిచిన మూడురోజులుగా ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్ర‌గ‌డ‌కు మ‌ద్దుతుగా స్పందిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆయ‌న ఆమ‌ర‌ణ దీక్ష‌కు మ‌ద్ద‌తుగా రిలే నిరాహార దీక్ష‌లు చేప‌డుతున్న ప‌లువురు కాపు నేత‌లు.. ప‌వ‌న్ క‌ల్యాణ్పై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లుచోట్ల ప‌వ‌న్ ఫ్లెక్సీల్ని ధ్వంసం చేసిన ఘ‌ట‌న‌లు మ‌ర్చిపోక ముందే.. ప‌వ‌న్ కు బ‌ల‌మైన అభిమాన‌గ‌ణం ఉన్న జిల్లాల్లో ఒక‌టిగా చెప్పే గుంటూరు జిల్లాలో కూడా ప‌వ‌న్ ప‌ట్ల ఆగ్ర‌హ జ్వాల‌లు వ్య‌క్తం కావ‌టం గ‌మ‌నార్హం.

ఆదివారం గుంటూరు జిల్లా రేప‌ల్లెలో కాపు మ‌హిళ‌లు నిర‌స‌న‌లు తెల‌ప‌ట‌మే కాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్లెక్సీని చించి.. త‌గ‌ల‌పెట్టేయ‌టం గ‌మ‌నార్హం. తాము ఎంతో అభిమానంతో ప‌వ‌న్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశామ‌ని.. కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఆయ‌న తీరు త‌మ‌ను నిరాశ ప‌ర్చిందంటూ మ‌హిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. చూస్తుంటే.. కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ప‌వ‌న్ ట్వీట్ల‌తో స‌రిపుచ్చ‌టం స‌రికాద‌న్న వాద‌న వినిపిస్తోంది.