Begin typing your search above and press return to search.

లోకేష్ పై జోకులు పేల్చిన ప‌వ‌న్‌!

By:  Tupaki Desk   |   21 Jan 2019 5:46 AM GMT
లోకేష్ పై జోకులు పేల్చిన ప‌వ‌న్‌!
X
ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ప్ర‌సంగాల్లో ప‌దును పెంచుతున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌పై ఓ వైపు విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే మ‌రోవైపు వారిపై జోకులు పేలుస్తున్నారు. జ‌న సైనికుల‌ను న‌వ్విస్తున్నారు. తాజాగా జ‌నసేన పోరాట యాత్ర‌లో భాగంగా ఓ ప్ర‌చార ర్యాలీలో ప్ర‌సంగించిన ప‌వ‌న్‌.. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు - ఏపీ మంత్రి నారా లోకేష్ పై త‌న‌దైన శైలిలో ఫ‌న్నీ కామెంట్స్ చేశారు.

నేత‌లు చూపించే దారిలోనే ప్ర‌జ‌లు న‌డుస్తార‌ని ప‌వ‌న్ అన్నారు. కాబ‌ట్టి నేత‌లు స‌న్మార్గంలో న‌డ‌వాల‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో మాత్రం సీఎం చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు స‌రైన మార్గ‌నిర్దేశ‌నం చేయ‌డం లేద‌ని ఆరోపించారు. వాళ్లేమీ మ‌హాత్మాగాంధీలు, బీఆర్ అంబేడ్కర్ లు కాద‌ని వ్యాఖ్యానించారు. లోకేష్ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. అత‌డేమైనా నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ అనుకుంటున్నాడా అని ప్ర‌శ్నించారు.

టీడీపీ ఎన్నిక‌ల గుర్తు సైకిల్‌. ఈ విష‌యాన్ని ప‌వ‌న్ ప్ర‌స్తావిస్తూ.. త‌మ ఎన్నిక‌ల గుర్తుగా ఉన్న సైకిల్ ను లోకేష్ ప‌ట్టుమ‌ని ప‌ది కిలోమీట‌ర్లు కూడా తొక్క‌లేడ‌ని ఎద్దేవా చేశారు. దీంతో ర్యాలీకి హాజ‌రైన జ‌న‌మంతా చాలాసేపు న‌వ్వుకున్నారు. రిక్షావాలా జిందాబాద్ అనే నినాదం త‌ర‌హాలో సైకిల్ వాలా జిందాబాద్ అని నినాదాలు చేయిస్తూ లోకేష్ తో కోన‌సీమ అంత‌టా సైకిల్ తొక్కించాల‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఒక‌వేళ లోకేష్ సైకిల్ యాత్ర చేప‌డితే.. వెళ్తూ వెళ్తూ ఎక్క‌డైనా ఇసుక రీచ్ క‌నిపిస్తే అక్క‌డ ఆగుతార‌ని ప‌వ‌న్ జోస్యం చెప్పారు. ఇసుక రీచ్ ద‌గ్గ‌ర ఉన్న‌వాళ్ల నుంచి ముడుపులు స్వీక‌రించి, ఆపై అక్క‌ణ్నుంచి లోకేష్ ముందుకు క‌దులుతార‌ని పేర్కొన్నారు. మ‌రో రీచ్ ద‌గ్గ‌రికెళ్లి అక్క‌డా అలాగే డ‌బ్బులు వ‌సూలు చేసుకుంటార‌ని ఆరోపించారు. ఏపీ కోరుకునేది ఇలాంటి నాయ‌కుల‌నా అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. లోకేష్ ఏమాత్రం ఇన్‌ స్పిరేష‌నల్ వ్య‌క్తి కానే కాద‌ని అన్నారు. ప‌వ‌న్ ఇలా మాట్లాడుతున్నంత‌సేపు జ‌న‌సేన మ‌ద్ద‌తుదారులు కేరింత‌లు కొడుతూ ఉన్నారు.