Begin typing your search above and press return to search.

జగన్ తరఫున బాబుకు సవాల్ విసిరాడు

By:  Tupaki Desk   |   24 Sep 2016 1:00 PM GMT
జగన్ తరఫున బాబుకు సవాల్ విసిరాడు
X
ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఏపీ అధికారపక్షం వదిలేసిన వైనం తెలిసిందే. హోదా గురించి కొంతకాలం హడావుడి చేసినా.. కేంద్రం సీన్లోకి వచ్చి అలాంటివి సాధ్యం కాదన్న విషయాన్ని బాబుకు అర్థమయ్యేలా చెప్పి.. తాము ఇచ్చింది తీసుకోవాలంటూ ప్యాకేజీ పేరిట కాస్తంత ముష్టి వేయటం తెలిసిందే. బాబుకున్న పరిమితుల పుణ్యమా అని మోడీ సర్కారు ఇచ్చిన ప్యాకేజీతో పొంగిపోయారు. కానీ.. ఆ విషయాన్ని ఒక్కసారిగా చెప్పేస్తే సీమాంధ్రుల్లో సెంటిమెంట్ దెబ్బ తినే అవకాశం ఉండటంతో కాస్త జాగ్రత్త వహించిన ఆయన.. హోదాఅంశాన్ని వదిలిపెట్టేది లేదంటూ ప్యాకేజీని స్వాగతించారు.

ప్యాకేజీని స్వాగతించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆ విషయాన్ని గుర్తించనట్లుగా ఉన్న చంద్రబాబు.. ప్యాకేజీ ప్రకటించిన రెండువారాల వ్యవధిలోనే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడ్ని విజయవాడకు పిలిపించి మరీ పెద్ద ఎత్తున సన్మానం చేసేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య హోదా లేదు గీదా లేదని తేల్చేశారు.

ఇలాంటి వేళ.. ఏపీకి హోదా లేదా? అన్న సందేహం అందరి మదిలో మెదులుతున్న వేళ.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. తాజాగా యువభేరి నిర్వహించిన ఆయన.. బీజేపీ.. టీడీపీ పార్టీలపైనా ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. హోదా అంశంపై వారు ప్రదర్శించిన రెండు నాల్కుల ధోరణిని ఉదాహరణలో సహా వెల్లడించిన ఆయన.. సీమాంద్రులు ఎంత మోసానికి గురి అవుతున్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పారు. ఏలూరులో నిర్వహించిన యువభేరీకి వచ్చిన పాజిటివ్ స్పందన జగన్ బ్యాచ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అందుకు తగ్గట్లే తాజాగా మాజీ మంత్రి పార్థసారధి ఒక సవాలు విసిరారు. హోదా విషయం మీద తమ అధినేత జగన్ తో ముఖాముఖి చర్చ జరిపేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమేనా? అని ప్రశ్నించారు.

తమ అధినేతతో ప్రత్యేక హోదా మీద ముఖాముఖి చర్చకు బాబు వస్తానంటే విజయవాడలో అయినా.. కుప్పంలో అయినా చర్చకు తాము సిద్ధమన్నారు. పార్థసారధి విసిరిన సవాలుపై చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఇద్దరు అధినేతలు.. ఒక వేదిక మీద కూర్చొని ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద తమకున్న కమిట్ మెంట్ ను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. మరి.. జగన్ బ్యాచ్ విసిరిన సవాలుకు చంద్రబాబు రియాక్షన్ ఏమిటో చూడాలి.