Begin typing your search above and press return to search.

లైవ్ చూసిన ఆ ముగ్గురు ఎవరు?

By:  Tupaki Desk   |   30 Sep 2016 5:25 AM GMT
లైవ్ చూసిన ఆ ముగ్గురు ఎవరు?
X
‘‘సర్జికల్ స్ట్రైక్స్’’ అన్న వెంటనే అందరి మదిలో మెదిలేది.. ఐదేళ్ల క్రితం పాక్ లోని అబొత్తాబాద్ లో గుట్టుగా తల దాచుకున్న బిన్ లాడెన్ ను హతమార్చటం కోసం అమెరికన్ నేవీ సీల్స్ ఏసేయటం గుర్తొస్తుంది. పాక్ కు సైతం తెలీకుండా సాగిన సదరు ఆపరేషన్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లాడెన్ ను సీల్స్ ఏసేసిన వైనాన్ని అమెరికా అధ్యక్షులు ఒబామా స్వయంగా చూసినట్లుగా చెబుతారు. మరి.. తాజాగా ఆక్రమిత కశ్మీర్ లో తిష్ట వేసిన ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం దాడి చేసే ఘట్టాన్ని కూడా లైవ్ లో చూశారా? చూస్తే.. ఎవరు చూశారు? అన్నప్రశ్నలు పలువురి మదిలో మెదులుతున్నాయి. అర్దరాత్రి దాటిన తర్వాత మొదలైన ఈ ఆపరేషన్.. తెల్లవారుజాము కంటే ముందు ముగిసిన వైనాన్ని ముగ్గురు ముఖ్యలు స్వయంగా పర్యవేక్షించినట్లుగా చెబుతున్నారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి దూసుకెళ్లి మరీ.. ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన ఈ ఉదంతాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ఆ ముగ్గురు ఎవరంటే.. ఒకరు రక్షణ మంత్రి మనోహర్ పారీకర్.. జాతీయ భద్రత సలహాదారు అజిత దోవల్.. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్. బుధవారం అర్ద రాత్రి 12.30 గంటలకు ఆపరేషన్ షురూ అయినప్పటికీ.. దీనికి సంబంధించిన అన్ని సన్నాహకాలు రాత్రి ఎనిమిది గంటలకే పూర్తి చేసుకొని.. చివరి సిగ్నల్ కోసం వెయిట్ చేశారట.

వాస్తవానికి బుధవారం రాత్రి ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ కమాండర్ కాన్ఫరెన్స్ లో డిన్నర్ పార్టీ ఉంది. దీనికి ఈ ముగ్గురు హాజరు కావాల్సి ఉంది. అయితే.. లక్షిత దాడుల నేపథ్యంలో ఈ ముగ్గురు ఆ పార్టీకి వెళ్లకుండా తాము అమలు చేయాల్సిన పథకాన్ని అంతిమంగా మరోసారి చెక్ చేసుకొని.. ప్రధాని మోడీకి సమాచారం అందించారు. పీవోకే దగ్గరకు వెళ్లిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకూ మొత్తం ఘటనల్ని ఈ ముగ్గురు లైవ్ లో చూసినట్లుగా ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. దాడుల్ని ఎలా చేయాలి? టార్గెట్ ఏమిటన్నది ఫిక్స్ చేసింది దోవల్ అని చెబుతున్నారు. పాకిస్థాన్ లో దాదాపు ఏడేళ్ల పాటు అండర్ కవర్ లో పని చేసిన దోవల్ కు పాక్ కు సంబంధించిన వ్యవహారాలన్నీ తెలుసని.. ఈ ఆపరేషన్ బాధ్యత మొత్తం ఆయనే చూసుకున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఆపరేషన్ ను స్టార్ట్ చేసేందుకు సిగ్నల్ ఇచ్చింది పారీకర్ అని చెబుతున్నారు. ప్రత్యేక డ్రోన్ల సాయంతో జరిగిన ఆపరేషన్ మొత్తాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. జరిగిన ఘటనకు సంబంధించిన మొత్తం పుటేజీని జాగ్రత్తగా భద్రపర్చినట్లుగా చెబుతున్నారు. లాడెన్ కు స్పాట్ పెట్టిన తరహాలోనే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాదుల పీచమణచటానికి భారత సైనికులు చేసిన సాహసోపేతమైన ఆపరేషన్ వీడియో రూపంలో నిక్షిప్తమైందని చెబుతున్నారు. మరి.. ఈ వీడియో బయటకు వస్తుందా? అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/