Begin typing your search above and press return to search.

బాబును క్రియేటివ్ గా పొగిడిన సునీత‌

By:  Tupaki Desk   |   23 Oct 2017 6:30 AM GMT
బాబును క్రియేటివ్ గా పొగిడిన సునీత‌
X
అధినేత‌ను పొగ‌డ్త‌ల్లో ముంచెత్త‌టానికి వీలుగా రాజ‌కీయ నేత‌లు చెప్పే మాట‌లు విన్న‌ప్పుడు.. ఆ విష‌యంలో వారి టాలెంట్ చూసిన‌ప్పుడు వావ్ అన‌కుండా ఉండ‌లేం. అధినేత మ‌న‌సును దోచుకునేలా వారి మాట‌లు ఉంటాయి. కాకుంటే.. కొన్ని సంద‌ర్భాల్లో వారి పొగ‌డ్త‌ల వెనుకే.. ప్ర‌శ్న‌లు వేసేలా ఉంటాయి. ఇవి.. కొత్త చిక్కుల్ని తెచ్చి పెడుతుంటాయి. తాజాగా ఏపీ రాష్ట్ర మంత్రి ప‌రిటాల సునీత చేసిన పొగ‌డ్త‌లు వింటే.. వావ్ అనుకోకుండా ఉండ‌లేం. ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌న‌ను దేవుడు కూడా మెచ్చేశాడ‌ని చెప్పేశారు.

దేవుడు అంత‌లా మెచ్చ‌బ‌ట్టే.. క‌ర‌వుతో విల‌విల‌లాడాల్సిన రాయ‌ల‌సీమ‌ను వ‌ర్షాల‌తో ముంచెత్తేలా చేయ‌ట‌మే కాదు.. జ‌ల‌సిరితో కొత్త అందాల‌తో మెరిసిపోతోంది సీమ‌. గ‌డిచిన నాలుగు ద‌శాబ్దాల్లో ఎప్పుడూ లేని రీతిలో రాయ‌ల‌సీమ‌లో ఇంత భారీగా వ‌ర్షాలు ఈసారే కురిసిన‌ట్లుగా ఆమె చెప్పారు. విజ‌య‌వాడ ప‌విత్ర సంగ‌మంలో అత్యంత ప‌విత్ర‌మైన మ‌న‌సుతో ముఖ్య‌మంత్రి హార‌తి ఇచ్చి కృష్ణ‌మ్మ‌కు స్వాగ‌తం ప‌ల‌క‌టం వ‌ల్లే వ‌రుణుడు క‌రుణించిన‌ట్లుగా ఆమె అభివ‌ర్ణించారు.

ఒక‌వేళ ప‌రిటాల వారి మాటే నిజ‌మ‌ని అనుకుందాం. బాబు ప‌విత్ర‌మైన మ‌న‌సును మెచ్చి వ‌రుణుడు వ‌ర్షాలు కురిపించార‌నే అనుకుందాం. మ‌రి.. ఈ త‌ర‌హా ప‌విత్ర‌మైన మ‌న‌సును చంద్ర‌బాబు గ‌డిచిన మూడేళ్లుగా ఎందుకు ఉప‌యోగించ‌లేదంటారు? ఈసారి వ‌రుణుడి మ‌న‌సును దోచిన చంద్ర‌బాబు.. గ‌డిచిన మూడేళ్ల‌లో ఎందుకు దోచుకోలేక‌పోయారు?​ ​

అన్న సందేహానికి కూడా ప‌రిటాల సునీత లాంటి వాళ్లు స‌మాధానం చెబితే బాగుంటుంది. ​