Begin typing your search above and press return to search.

రైతుల‌కు..రెడ్‌ లైట్ ఏరియాకు ముడిపెట్టిన ప‌రిటాల శ్రీ‌రామ్‌

By:  Tupaki Desk   |   17 July 2018 5:36 PM GMT
రైతుల‌కు..రెడ్‌ లైట్ ఏరియాకు ముడిపెట్టిన ప‌రిటాల శ్రీ‌రామ్‌
X
టీడీపీ యువ‌నేత‌ - ప‌రిటాల కుటుంబ వారసుడిగా పేరొందిన ప‌రిటాల శ్రీ‌రామ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రైతు కుటంబాల‌కు రెడ్‌ లైట్ ఏరియాకు ముడిపెట్టి క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. మంగళవారం టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతూ....రైతుల స‌మ‌స్య‌ల గురించి - సీమ స‌మ‌స్య‌ల గురించి పేర్కొన్నారు. అయితే, ఈ సంద‌ర్భంగా ఆయ‌న క‌ల‌క‌లం రేపే కామెట్లు చేశారు. `` సీమ‌లో రైతుల ఆత్మహత్యలు - వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో రైతులు దీన స్థితి ఎదుర్కొంటున్నారు. రైతు కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు ముంబై వ్యభిచార గృహాలకు వెళ్తున్నారు’ అంటూ శ్రీ‌రామ్‌ క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు.

సాక్షాత్తు మంత్రివ‌ర్గంలోని కేబినెట్ హోదాలో గ‌ల నాయ‌కురాలైన ప‌రిటాల సునీత త‌న‌యుడు ప‌రిటాల‌ శ్రీ‌రామ్ రైతుల గురించి చేసిన కామెంట్ల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నాయ‌కులుగా మూడు త‌రాలుగా ప‌రిటాల కుటుంబం రాజ‌కీయాల్లో ఉంద‌ని పేర్కొంటూ అనంత‌పురం వెన‌క‌బాటు గురించి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల ఆయ‌న పున‌రాలోచించుకోవాల‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. రైతుల దీన స్థితికి ప‌రిష్కార మార్గాలు చూపాల్సింది పోయి ఇలా రెడ్‌లైట్ ఏరియాతో లింకు పెట్టి మాట్లాడ‌టం ఏంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

కాగా, పరిటాల శ్రీరామ్‌ వివాదాస్పద వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు స్పందించారు. ప‌ట్టెడ‌న్నం పెట్టే రైతును ఇలా అవ‌మానించ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న సూచించారు. గత 25 సంవత్సరాలుగా పదవుల్లో ఉంటున్న పరిటాల కుటుంబం ఏం సాధించిందని ప్రశ్నించారు. కరవుపై మాట్లాడే అర్హత పరిటాల శ్రీరామ్‌కు లేదని ఆయన పేర్కొన్నారు. మంత్రి సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గం నుంచి వేలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు.. కర్నాటక - కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లారని తెలిపారు. రైతుల‌కు బేష‌ర‌తుగా మంత్రి - ఆమె కుమారుడు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.