Begin typing your search above and press return to search.

అమ్మాడీఎంకే పేరుతో ఎంట్రీ ఇవ్వ‌నున్న సెల్వం

By:  Tupaki Desk   |   19 Feb 2017 7:23 AM GMT
అమ్మాడీఎంకే పేరుతో ఎంట్రీ ఇవ్వ‌నున్న సెల్వం
X
త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌కీయాలు ఇప్పుడు మ‌రింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న త‌మిళ‌నాడు రాష్ట్ర అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌లో సీఎం ప‌ళ‌ని స్వామికి 122 ఓట్లు, మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వంకు 11 ఓట్లు కావ‌డంతో విశ్వాస ప‌రీక్ష‌లో ప‌ళ‌ని స్వామి విజ‌యం సాధించాడ‌ని స్పీక‌ర్ ధ‌న్‌పాల్ ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. ఈనేప‌ధ్యంలో కొత్త పార్టీ పెట్టే యోచ‌న‌లో మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం ఉన్నారని తెలుస్తోంది. 11 మంది ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ అన‌ర్హ‌త వేటు వేసే అవ‌కాశం ఉన్నందున‌, అమ్మా డీఎంకే పేరుతో కొత్త పార్టీ పెట్టే ఆలోచ‌న‌లో సెల్వం ఉన్నారు. ఈ మేర‌కు కొత్త పార్టీ పెట్టేందుకు పార్టీ నేత‌ల‌తో ప‌న్నీర్ సెల్వం చ‌ర్చిస్తున్నారు.

కాగా, విశ్వాస పరీక్షలో పళనికి ఓటు వేయడం అమ్మకు ద్రోహం చేయడ మేనని పన్నీర్‌ సెల్వం వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. తన పోరాటం ముగియ లేదని, కొనసాగిస్తానని ఆయన అన్నారు. రహస్య ఓటింగ్‌కు స్పీకర్‌ అనుమతించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. శశికళకు వ్యతరేకంగా రాష్ట్రమంతా పర్యటిస్తానని చెప్పిన ఆయన చివరకు ధర్మం గెలిచి తీరుతుందని అన్నారు. ఈ వ్యాఖ్య‌ల వెనుక కొత్త పార్టీ ఆలోచ‌న ఉంద‌ని చెప్తున్నారు.

మ‌రోవైపు అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గి హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటున్న తమిళనాడు సీఎం పళనిస్వామికి మరో ‘గండం’ గట్టెక్కాల్సిన గడ్డు పరిస్థితి ఉంద‌ని చెప్తున్నారు. ప్రతిపక్ష నేత ఎంకె స్టాలిన్ అసెంబ్లీ నుంచి నేరుగా రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ చేతిలో ఫిర్యాదుల చిట్టా పెట్టివచ్చారు. అపోజిషన్ సభ్యులందరినీ బలవంతంగా బైటికి పంపి ఫ్లోర్ టెస్ట్ జరిపారని.. ఇది అమానుషమని, చట్టవిరుద్ధమని గవర్నర్ కి కంప్లయింట్ చేశారు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ పెట్టమన్న తమ డిమాండ్ ను కూడా స్పీకర్ పట్టించుకోలేదని చెప్పారు. గవర్నర్ నుంచి స్టాలిన్ కి ఎటువంటి హామీ దొరికిందన్నది తెలియకపోయినా.. గవర్నర్ జోక్యం చేసుకునే ‘పరిస్థితు’లు అయితే ఇక్కడ మెండుగా ఉన్నాయన్నది లీగల్ ఎనలిస్టులు చెబుతున్న మాట. వీడియో ఫుటేజ్ తెప్పించుకుని.. పరిశీలించి.. బలపరీక్ష సరైన పద్ధతిలో జరగలేదని గవర్నర్ భావిస్తే ముఖ్యమంత్రికి నోటీసులు పంపే అవకాశముంది. సభలో జరిగిన ‘తతంగం’పై విచారణకు ఆదేశించవచ్చు కూడా. మళ్ళీ ఫ్లోర్ టెస్ట్ జరపాలని ఆర్డర్ చేయడమే కాకుండా.. దాని మీద పర్యవేక్షణ కోసం రాజ్ భవన్ నుంచి ఇద్దరు అబ్జర్వర్స్ ని కూడా పంపవచ్చు. గతంలో కర్ణాటకలో ఎడ్యూరప్ప బలపరీక్ష సమయంలో ఇటువంటి ఎక్స్ పరిమెంటే జరిగింది. యడ్డీని మళ్లీ పరీక్ష రాయించేదాకా వదిలిపెట్టలేదు అప్పటి కర్ణాటక గవర్నర్ భరద్వాజ్. ఇప్పుడు.. పళనిస్వామికి సైతం అటువంటి ‘గండం’ పొంచివుందని డీఎంకే వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/