Begin typing your search above and press return to search.

ఆత్మ‌ల పేరుతో చిన్న‌మ్మ బ్యాచ్‌ కు దెబ్బేస్తార‌ట‌

By:  Tupaki Desk   |   24 Aug 2017 4:56 AM GMT
ఆత్మ‌ల పేరుతో చిన్న‌మ్మ బ్యాచ్‌ కు దెబ్బేస్తార‌ట‌
X
త‌మిళ‌నాడు అధికార‌ప‌క్షంలో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. గ‌డిచిన కొంత‌కాలంగా అన్నాడీఎంకేలో సాగుతున్న అంత‌ర్గ‌త పోరు ఈ రోజు కీల‌క‌ద‌శ‌కు చేరుకోనుంది. మొన్న‌టి వర‌కు నిప్పులు చెరుగుకున్న ప‌ళ‌ని స్వామి.. ప‌న్నీరు సెల్వంలు ఒక్క‌టి కావ‌టం.. వారిద్ద‌రూ క‌లిసి చిన్న‌మ్మ‌కు చెక్ పెట్టేందుకు స‌ర్వం సిద్ధం చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

అనారోగ్యంతో అపోలో ఆసుప‌త్రిలో చేరిన అమ్మ అక్క‌డే అనంత‌లోకాల‌కు వెళ్లిపోవ‌టం తెలిసిందే. అప్ప‌టి నుంచి అన్నాడీఎంకేలో అంత‌ర్గ‌త రాజ‌కీయం లెక్క‌లేన‌న్ని మ‌లుపులు తీసుకున్నాయి. తొలుత పార్టీ మీద చిన్న‌మ్మ ప‌ట్టు తెచ్చుకున్న‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రికావాల‌న్న అత్యాశ కార‌ణంగా ప‌న్నీర్ సెల్వం నుంచి ప్ర‌తిఘ‌ట‌న మొద‌లైంది. ఆయ‌న్ను క‌ట్ట‌డి చేసేందుకు చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌ తెర మీద‌కు తీసుకొచ్చిన ప‌ళ‌ని స్వామి ఇప్పుడు ఆమెకు పెద్ద త‌ల‌పోటుగా మారారు.

ఈ ఇద్ద‌రు చేతులు క‌ల‌ప‌టంతో శ‌శిక‌ళ ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. త‌న‌కు విధేయుడిగా ఉంటాడ‌ని భావించిన ప‌ళ‌నిస్వామి ఊహించ‌నిరీతిలో షాక్ ఇవ్వ‌టంతో త‌న బంధువు దిన‌క‌ర‌న్ సాయంతో పావులు క‌దుపుతున్న చిన్న‌మ్మ‌.. కొంత‌మంది ఎమ్మెల్యేల్ని త‌న వైపుకు తీసుకెళ్లిపోయారు. దీంతో.. ప‌వ‌ర్ లో ఉన్న ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వం మైనార్టీగా మారింది. ఈ నేప‌థ్యంలో పార్టీ మీద‌..ప్ర‌భుత్వం మీదా పూర్తిస్థాయి ప‌ట్టు పెంచుకునేందుకు ప‌ళ‌ని.. ప‌న్నీరులు ఒక్క‌టై రంగంలోకి దిగారు.

చిన్న‌మ్మ‌కు చెక్ చెప్ప‌ట‌మే కాదు.. ఆమె కుటుంబ స‌భ్యుల్ని పార్టీ నుంచి బ‌య‌ట‌కు త‌రిమేయ‌టం ద్వారా అన్నాడీఎంకేకు ప‌ట్టిన పీడ వ‌దిలించాల‌న్న ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రుల‌ను.. ఎమ్మెల్యేల‌ను త‌క్ష‌ణ‌మే చెన్నైకి చేరుకోవాలంటూ ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి ఆదేశించారు. గురువారం పార్టీ అత్య‌వ‌స‌ర కార్య‌వ‌ర్గ స‌మావేశాన్ని నిర్వ‌హించి.. శ‌శిక‌ళ‌.. ఆమె కుటుంబ స‌భ్యుల‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించాల‌ని భావిస్తున్నారు. దీంతో.. పార్టీలో పాతుకుపోయిన చిన్న‌మ్మ బ్యాచ్‌ ను అధికారికంగా బ‌య‌ట‌కు పంపాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు.

అదే స‌మ‌యంలో త‌మ చేతిలో ఉన్న ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండేందుకు వీలుగా త‌మ వ‌ర్గంతో శిబిరం ఏర్పాటు చేయాల‌ని ప‌ళ‌నిస్వామి భావిస్తున్నారు. ఒక‌వైపు త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేస్తూనే మ‌రోవైపు భావోద్వేగ రాజ‌కీయాల‌కు తెర తీస్తున్నారు ప‌ళ‌ని.. ప‌న్నీర్ లు. ఎంజీఆర్‌.. జ‌య‌ల‌లిత ఆత్మ‌లు త‌మ‌తోనే ఉన్నాయ‌ని.. ఆ ఆత్మ‌లు త‌మ‌తో న్నంత కాలం త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చ‌టం ఎవ‌రి త‌రం కాద‌ని వారు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా నిర్వ‌హించిన ఎంజీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన్న వీరిద్ద‌రూ చిన్న‌మ్మకు షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాల‌ని డిసైడ్ అయిన‌ట్లు చెబుతున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో చిన్న‌మ్మ వ‌ర్గం కూడా త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేస్తోంది. దిన‌క‌ర‌న్ ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తు్న‌ట్లు ప్ర‌క‌టించిన వైనంపై స్పందించిన ఆ వ‌ర్గం.. అసెంబ్లీ స్పీక‌ర్ గా ఉన్న ధ‌న‌పాల్ ను సీఎం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో.. ఇవాళ ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ప‌ళ‌ని.. ప‌న్నీరులు చిన్న‌మ్మ బ్యాచ్‌ కు భారీ షాక్ ఇవ్వ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.