Begin typing your search above and press return to search.

ఎర్రబెల్లికి వార్నింగ్ బెల్స్ మోగాయి

By:  Tupaki Desk   |   25 Nov 2015 7:07 AM GMT
ఎర్రబెల్లికి వార్నింగ్ బెల్స్ మోగాయి
X
కొంతమంది నేతలు ఉంటారు. వారికి.. పార్టీలు.. పరిస్థితులతో సంబంధం ఉండదు. వారి పేరు ప్రఖ్యాతులతో దూసుకెళుతుంటారు. వారు కానీ.. బరిలోకి దిగితే విజయం వారి వెంట నడుస్తుంది. మిగిలిన చోట్ల సంగతి పక్కన పెడితే..వారు చెప్పిన మాటకు తూచా తప్పకుండా ఆ నేతలకు చెందిన నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసేస్తుంటారు. అలా నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టున్న నేతలు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి కొద్దిమందిలో ఒకరు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత.. సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు.

1994లో తొలిసారి వరంగల్ జిల్లా వర్దన్నపేట నుంచి గెలుపొందిన ఆయన.. తనదైన శైలిలో దూసుకుపోతుంటారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. వర్దన్నపేటలో విజయం మాత్రం ఎర్రబెల్లి దయాకర్ రావుదే. 2014లో ఆయనకు ప్రతికూలంగా వాతావరణం ఉందని.. ఫలితాల విషయంలో ఇబ్బందికర పరిస్థితి ఉందన్న మాట వినిపించినప్పటికీ ఆయన విజయం సాధించారు. ఇలా ఆయన బరిలోకి దిగిన ప్రతిసారి విజయం సాధిస్తూనే ఉంటారు. చివరకు 2008లో వరంగల్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల బరిలోకి దిగి మరీ విజయం సాధించారు.

అలాంటి ట్రాక్ రికార్డు ఎర్రబెల్లి.. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వర్దన్నపేట నుంచి పాలకుర్తికి షిఫ్ట్ అయ్యారు. నియోజకవర్గాన్ని తన కనుసన్నల్లో ఉంచుకునే ఎర్రబెల్లి కారణంగా.. తాజాగా జరిగిన వరంగల్ ఉప ఎన్నికల్లో పాలకుర్తిలో టీఆర్ ఎస్ కు ఇబ్బందికర వాతావరణం ఉంటుందని.. మొత్తంగా మెజార్టీ తగ్గటానికి పాలకుర్తి కారణం అవుతుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. పలువురు ఇదే మాటను చెప్పారు.

అందుకు భిన్నమైన పరిస్థితి వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలు విడుదలైన తర్వాత చూస్తే కనిపించటం విశేషం. తన రాజకీయ కెరీర్ లో ఎర్రబెల్లికి తొలిసారి ఎదురుదెబ్బ తగిలిందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. నియోజకవర్గంలో ఎంతో పట్టున్న ఎర్రబెల్లి మాటకు భిన్నంగా.. ఈసారి పాలకుర్తి ఓటర్లు అధికారిక టీఆర్ ఎస్ కు భారీగా ఓట్లు వేయటమే కారణంగా చెప్పాలి. ఈ పరిణామం ఎర్రబెల్లికి వార్నింగ్ బెల్స్ మోగిస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లి సొంత నియోజకవర్గమైన పాలకుర్తిలో టీఆర్ ఎస్ అభ్యర్థికి 75,261 ఓట్లు రాగా.. టీడీపీ బలపర్చిన బీజేపీ అభ్యర్థి దేవయ్యకు 39,475 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కుమాత్రం 19,919 ఓట్లు మాత్రమే లభించాయి.

టీఆర్ ఎస్ అభ్యర్థికి మెజార్టీని ప్రభావితం చేస్తారనుకున్న పాలకుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థికి దాదాపు 36 వేల మెజార్టీకి కారణంగా నిలిచింది. ఎర్రబెల్లి తన పట్టును కోల్పోతున్నారనటానికి తాజా ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా చెప్పొచ్చు.