Begin typing your search above and press return to search.

శ్రీరాముడు లంకను గెలిచి విభిషణుడికి ఇచ్చాడు!

By:  Tupaki Desk   |   1 Oct 2016 10:43 AM GMT
శ్రీరాముడు లంకను గెలిచి విభిషణుడికి ఇచ్చాడు!
X
పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో నిర్దేశిత దాడులు (సర్జికల్‌ స్ట్రైక్స్‌) నిర్వహించి.. ఎనిమిది ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసి, పదులసంఖ్యలో ముష్కరులను మట్టుబెట్టిన అనంతరం తొలిసారిగా భారత కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పరీకర్ స్పందించారు. తొలిసారి సర్జికల్ స్టరిక్ పై స్పందించిన పరీకర్.. ఉగ్రమూకలకు షాకిచ్చిన సాహసోపేత పనికి భద్రతా దళాల శౌర్యప్రతాపాలను ప్రశంసించారు. అనంతరం ఎవరైనా భారత్‌ కు హాని తలపెట్టాలని చూస్తే వారికి తగిన బుద్ధి చెప్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమయంలో పాక్ పై తనదైన స్టైల్లో సెటైర్స్ వేసిన కేంద్ర రక్షణమంత్రి... సర్జరీ చేయించుకున్న వారిలాగే ప్రస్తుతం పాకిస్థాన్ ఇంకా కోమాలోనే ఉందని అన్నారు. ఇదే క్రమంలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ వంటివేమీ జరగలేదని - అదంతా భారత మీడియా సృష్టని పాకిస్థాన్‌ తోసిపుచ్చుతున్న అంశంపై స్పందిస్తూ... పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత బలగాలు ప్రవేశించి దాడులు నిర్వహించడాన్ని ఆ దేశం ఇంకా నమ్మలేకపోతున్నదని ఆయన పేర్కొన్నారు.

ఇదే సమయంలో బంగ్లాదేశ్ విషయంలో జరిగిన అంశానికి రామాయణాన్ని ముడిపెట్టి చెప్పిన పరీకర్ "మేము ఏ దేశాన్ని కబళించాలని కోరుకోవడం లేదు. శ్రీరాముడు లంకను గెలిచి దాన్ని విభిషణుడికి ఇచ్చాడు. సరిగ్గా బంగ్లాదేశ్‌ విషయంలోనే మేం చేసింది అదే" అని అన్నారు. అలాగే "మేం ఎవరికీ హాని తలపెట్టాలని కోరుకోము - అలా అని ఎవరైనా మాకు హానితలపెట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు - తగిన రీతిలో బుద్ది చెప్తాం" అని పరీకర్‌ అన్నారు. "లంకకు వెళ్లేముందు తన శక్తి ఏమిటో ఆంజనేయుడికి తెలియదు - అలాగే ఇండియన్ ఆర్మీ శక్తి ఏమిటో తాను తెలియజేశాను - ప్రధాని మోడీ ఆదేశాల మేరకు సైన్యం తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించింది" అని భారత సైన్యాన్ని పరీకర్ ప్రశంసించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/