Begin typing your search above and press return to search.

చుక్క రక్తం చిందినా.. నెత్తుటేరులే అంటున్న పాక్!

By:  Tupaki Desk   |   26 Sep 2016 5:08 AM GMT
చుక్క రక్తం చిందినా.. నెత్తుటేరులే అంటున్న పాక్!
X
కోజీకోడ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగానికి పాకిస్థాన్ స్పందించింది. శ్రీనగర్‌ లో అశాంతి నెలకొనే పరిస్తితులు కల్పిస్తే.. భారతదేశ రాజధాని ఢిల్లీ కూడా శాంతియుతంగా ఉండబోదని బెదిరించే ప్రయత్నం చేశారు పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి పర్వాయిజ్ రషీద్. శీనగర్ లో ఒక్క రక్తపు బొట్టు చిందినా కూడా ఏకంగా రక్తం ఏరుపై పారుతుందని వ్యాఖ్యానించారు. నిజమైన క్రూరులే ప్రపంచంలో ఏకాకులవుతారని అనే కాంఫిడెంట్ స్టేట్ మెంట్ ఒకవైపు ఇస్తూనే... అంతర్జాతీయ సమాజంలో పాక్ ను ఒంటరిని చేయాలనే ప్రయత్నాలు ఏమైనా అవి భారత్ తక్షణం మానుకోవాలని మాట్లాడారు!

భారతదేశం ఆక్రమించిన కశ్మీర్‌ లో అమాయకులపై సైన్యం అకృత్యాలకు పాల్పడుతుందని, ఆ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని.. పేదరికాన్ని, నిరక్షరాస్యతను నిర్మూలించాలన్న లక్ష్యం తమకూ ఉందని.. చెప్పుకొచ్చారు పర్వాయిజ్ రషీద్. ఇక.. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందంటూ తమ దేశంపై మోడీ చేసిన వ్యాఖ్యలను దుష్ప్రచారంగా చెబుతున్న రషీద్... కశ్మీర్‌ పై నుంచి దృష్టి మళ్లించేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం భారత్ ప్రవర్తిస్తుందని అభివర్ణించారు. మరోవైపు... భారత్ పై ఎప్పుడు దాడి జరిగినా అది పాక్ పనే అంటున్నారని, నిరాధార ఆరోపణల ద్వారా పాకిస్థాన్‌ కు వ్యతిరేకంగా భారతీయ నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం ఈ దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని పాక్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. ఇదే క్రమంలో బలూచిస్థాన్‌ విషయంలో జోక్యాన్ని భారత మానుకోవాలని ఇండియాలో పాక్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత అన్నారు.

కాగా... ఉడీ ఘటన దేశం మొత్తాన్ని కలచివేసిందని.. దాడికి పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిని భారత్ ఎన్నటికీ మరచిపోదని, 18 మంది జవాన్ల త్యాగాల్ని వృథా కానివ్వమని కేరళలోని కోజికోడ్‌ లో బీజేపీ జాతీయ మండలి సమావేశం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో అన్నారు.