Begin typing your search above and press return to search.

కొత్త ట్రెండ్: బ్యాంకుల‌కు డిటెక్టివ్ సేవ‌లు

By:  Tupaki Desk   |   26 April 2018 5:26 AM GMT
కొత్త ట్రెండ్: బ్యాంకుల‌కు డిటెక్టివ్ సేవ‌లు
X
మొండి బ‌కాయిలు - వేల‌కోట్లు తీసుకొని ఎగ‌వేసి పోతున్న వారితో త‌ల‌బొప్పి క‌ట్ట‌డమే కాకుండా బ్యాంకు భ‌విష్య‌త్తే ప్ర‌శ్నార్థ‌కం అవుతున్న నేప‌థ్యంలో...వాటి ర‌థ‌సార‌థులు కొత్త నిర్ణ‌యం తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందుకోసం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటూ ఈ క్ర‌మంలోనే డికెక్టివ్‌ ల సేవ‌లు పొందెందుకు రెడీ అవుతున్నారు. ఇంత‌కీ ఏ బ్యాంక్ ఇలాంటి ఆలోచ‌న చేసింది అంటారా? దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభ‌కోణానికి సాక్ష్యంగా నిలిచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్. అప్పులు తీసుకుని ఎంతకీ చెల్లించనివారి జాడను గుర్తించేందుకు డిటెక్టివ్‌ ల సహాయం తీసుకోవాల‌ని పీఎన్‌ బీ నిర్ణ‌యం తీసుకుంది.

గతేడాది డిసెంబర్ నాటికి బ్యాంక్ మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌ పీఏ) విలువ రూ.57,519 కోట్లకు చేరిన నేపథ్యంలో బకాయిల వసూళ్లలో భాగంగా పీఎన్‌ బీ ఇప్పటికే గాంధీగిరిని అనుసరిస్తున్న విషయం తెలిసిందే. రుణ ఎగవేతదారుల ఇళ్లు - కార్యాలయాల ముందు బ్యాంక్ ఉద్యోగులు శాంతియుతంగా తమ నిరసనను వెలిబుచ్చే కార్యక్రమమే గాంధీగిరి. ఈ క్రమంలోనే మరో ముందడుగేసిన పీఎన్‌ బీ.. ఇప్పుడు డిటెక్టివ్ ఏజెన్సీల గడప తొక్కాలని నిర్ణయించుకుంది. బాకీపడి తప్పించుకు తిరుగుతున్నవారిని కనిపెట్టేందుకు సదరు ఏజెన్సీల నుంచి దరఖాస్తులనూ ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నవారు వచ్చే నెల 5లోగా తమ దరఖాస్తులను సమర్పించాలని బుధవారం ప్రకటించింది. అందులో అన్ని వివరాలను వెల్లడించాలని పేర్కొంది. బ్యాంక్ రికార్డుల ప్రకారం ఉన్న చిరునామాల్లో బకాయిదారులు దొరక్కపోతే - వారి వారసుల్నైనా - పూచీకత్తుదారుల్నైనా పట్టుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా డిటెక్టివ్ ఏజెన్సీలకు పీఎన్‌ బీ స్పష్టం చేసింది. గరిష్ఠంగా 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని - కేసు ప్రాధాన్యత దృష్ట్యా 90 రోజుల వరకు పొడిగించుకోవచ్చని తెలిపింది.