Begin typing your search above and press return to search.

మోడీ కంటే..మంత్రుల తీరే బాగుంద‌ట‌

By:  Tupaki Desk   |   10 Dec 2017 5:13 AM GMT
మోడీ కంటే..మంత్రుల తీరే బాగుంద‌ట‌
X
అవును. తాజాగా వెలువ‌డిన స‌మాచారం ప్ర‌కారం ఇదే అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కంటే ఆయ‌న మంత్రులే భేష్ అంటున్నారు. మోడీజీ రూటు మార్చుకుంటే బాగుంటుంద‌ని ఆశిస్తున్నారు. ఇదంతా మోడీజీ సోష‌ల్ మీడియాలో వ్య‌వ‌హ‌రించే తీరు గురించి. అదేంటి...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అత్యధికంగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆయ‌న కూడా నిత్యం త‌న స‌మాచారాన్ని అప్‌ డేట్ చేస్తుంటారు. అయినా ఇలాంటి అభిప్రాయం రావ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా? మీ సందేహం ఎంత వ‌ర‌కు నిజ‌మో....తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చిన స‌మాచారం కూడా అంతే నిజం. ఎందుకంటే...ఇది ఆర్టీఐ ద‌ర‌ఖాస్తు కింద సాక్షాత్తు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ఇచ్చిన స‌మాచారం కాబ‌ట్టి.

ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌ధాని మోడీ ప‌లు అంశాల‌పై విశేషంగా స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆయన పేరున విస్తృతంగా ఉపయోగంలో ఉన్న ట్విట్టర్‌ ఖాతా కేవలం ప్రధాని నుంచి ప్రజలకు సమాచారం చేరవేయడానికి మాత్రమే ఉద్దేశించినదట. అందులో సాధారణ ప్రజలు ఎవరైన తమకు ఎదురైన సమస్యల గురించి ప్రస్తావిస్తే వాటికి జవాబు ఇవ్వడం అంటూ ఉండదట. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మోడీ టీంలోని మంత్రులు ప్ర‌ధాని కంటే ఎంతో మేల‌ట‌. కేంద్ర‌ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ - ఇదివరకటి రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు నిర్వహించిన ట్విట్టర్‌ ఖాతాలో ఎవరు ఎలాంటి సమస్య గురించి ఫిర్యాదు చేసినా ఏదో రూపంలో తిరిగి ప్రతిస్పందన ఉండేది. కానీ మోడీ పేర ఉన్న ట్విట్టర్‌ ఖాతా అలాంటిది కాదని తేలింది.

సమాచార హక్కు కింద న్యాయవాది దేవ్‌ ఆశీశ్‌ భట్టాచార్య ప్రశ్నకు సమాధానంగా పీఎంఓ ఈ వివ‌రాలు ఇచ్చింది మ‌రి! ఈ ఖాతా నిర్వహణ కేంద్ర ప్రభుత్వం చేతిలో కానీ, పీఎంఓ చేతిలో కాని ఉండదని కూడా సమాధానం వచ్చింది. ప్రధాని పర్యటనలు - ప్రసంగాలు - వివిధ శాఖల నుంచి అందిన తాజా సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు మాత్రమే ఆ ఖాతాను ఉపయోగిస్తున్నట్టు పీఎంఓ పౌరసంబంధాల అధికారి తన సమాధానంలో స్పష్టం చేశారు. ప్రధాని పేరుతో రెండు ఖాతాలు ఉపయోగంలో ఉన్నాయని అందులో మోడీజీ తాను అనుకున్న స‌మాచారం చేర‌వేస్తుంటార‌ని వెల్ల‌డించారు. డిజిటల్‌ ఇండియా స్వప్నం పేరుతో మోడీ ప్రారంభించిన కార్యక్రమాన్ని ఆయన కార్యాలయమే దిగజార్చివేయడం తనకు చాలా ఆవేదన కలిగించిందని భట్టాచార్య వివరించారు. ప్ర‌ధాని మోడీ టీంలోని మంత్రులు త‌మ శాఖ ప‌రిధిలోని అంశాల‌పై స్పందిస్తుంటే...ప్ర‌ధాని హోదాలో...సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉండే మోడీజీ త‌న అకౌంట్‌ ను ఇలా కేవ‌లం త‌న భావాల‌కు మాత్ర‌మే వేదిక‌గా చేసుకోవ‌డం బాధాక‌ర‌మ‌ని భ‌ట్టాచార్య పేర్కొన్నారు.