Begin typing your search above and press return to search.

నంద్యాల‌లో వీరి ఓటు చాలా హాట్ గురు

By:  Tupaki Desk   |   23 Aug 2017 6:20 AM GMT
నంద్యాల‌లో వీరి ఓటు చాలా హాట్ గురు
X
నంద్యాల అసెంబ్లీ ఉప‌ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా వైకాపా - తెలుగుదేశం పావులు కదుపుతుండ‌టంతో ఎక్క‌డ లేని హైప్ సృష్టించిన సంగ‌తి తెలిసిందే. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న తలంపుతో ఉన్న ప్రధాన రాజకీయపార్టీలు ప్రతి ఓటును కీలకంగా చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను బుధవారం నంద్యాలకు రప్పించేందుకు చేసిన ఖ‌ర్చు మిగ‌తా ఓట‌ర్ల కంటే ఖ‌రీదైన ఓటుగా ఉందంటున్నారు. స్థానికంగా లేని ఓట‌ర్ల‌ను త‌ర‌లించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

నంద్యాల వాసుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ - బెంగళూరు - చెన్నైలో ఎక్కువ మంది సాఫ్ట్‌ వేర్ - ఇతర ఉద్యోగాలు చేస్తున్నారు. వీరికి తోడు నంద్యాల ప్రాంతానికే పరిమితమైన పాలిష్ కట్టింగ్ స్కిల్డ్ వర్కర్లు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. వీరిని రప్పించేందుకు ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు తిరిగే ప్రైవేటు బస్సుల్లో కొన్ని సీట్లు రిజర్వు చేసి పెట్టారు. రెండు మూడు వేల మంది నంద్యాల ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు అంచనా, ఉప ఎన్నిక జరుగుతున్నందున ఓటు వేసేందుకు రావాలని బయటి ప్రాంతాల్లో ఉన్న వారికి బంధువుల ద్వారా ఇప్పటికే కబురంపారు. అయితే పోలింగ్ తేదీ నాటికి నంద్యాలకు చేరుకోవాలంటే రైళ్లు - బస్సుల్లో రిజర్వేషన్లు దొరక్కపోతే ప్రయాణం మానుకుంటారని భావించిన నేతలు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. నంద్యాలలోని వారి బంధుమిత్రుల ద్వారా ఫోన్ నెంబర్లు సేకరించి ఓటు వేసేందుకు రావాలని అభ్యర్థిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించామని చెబుతూ బస్సులు బయలుదేరే స్థలం, సమయం కూడా సూచిస్తున్నారు.

మ‌రోవైపు గతంతో పోలిస్తే ఈసారి ఓటు విలువ అమాంతం పెరిగిపోయింది. ఓటుకు రూ. 2 వేల నుంచి రూ.3 వేల వరకు ముట్టజెపుతున్నట్లు సమాచారం. వార్డుల వారీగా ఓటరు జాబితాను అనుసరించి 60 నుంచి 70 శాతం మంది ఓటర్లకు డబ్బు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అయితే డబ్బు పంపిణీ వ్యవహారాన్ని చోటానాయకులు పకడ్బందీగా నిర్వహించారు. అయితే కొన్నిచోట్ల వీరు చేతివాటం ప్రదర్శించడంతో డబ్బు అందని ఓటర్లు నేతలను నిలదీయడం గమనార్హం. దీంతో కంగుతిన్న నేతలు చోటా నేతలను మందరించడమేగాక అప్పటికప్పుడు అలాంటి వారికి డబ్బు సర్దుబాటుచేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని సుమారు 20 శాతం మంది ఓటర్లకు డబ్బు ముట్టకపోవడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. గతంలో నంద్యాలలో జరిగిన ఎన్నికల్లో ఓటుకు రూ.500 కంటే ఎక్కువ పంపిణీ చేయలేదు. ఈసారి టీడీపీ, వైసీపీ పోటీపడి మరీ ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కొంతమంది చేతివాటం ప్రదర్శించి రూ.2 వేల స్థానంలో రూ. వెయ్యి, రూ,3 వేల స్థానంలో రూ.2 వేలు అందించినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.