Begin typing your search above and press return to search.

బ్రిట‌న్‌ లో చ‌దువులు...మ‌నోళ్లకు క‌ష్టాలు

By:  Tupaki Desk   |   17 Jun 2018 4:44 AM GMT
బ్రిట‌న్‌ లో చ‌దువులు...మ‌నోళ్లకు క‌ష్టాలు
X
మ‌న విద్యార్థుల ఉన్న విద్యాభ్యాసానికి ఒక్కో దేశం త‌లుపులు మూస్తోంది. ఇప్ప‌టికే అగ్ర‌రాజ్యం అమెరికా ప‌లు నిబంధ‌న‌ల‌తో మ‌న విద్యార్థుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుండ‌గా..బ్రిట‌న్ సైతం చేరిపోయింది. బ్రిటన్ యూనివర్సిటీల్లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం వీసా నిబంధనలను మరింత సడలించింది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ విధానంలో చేసిన సవరణలను బ్రిటన్ హోం శాఖ పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టింది. విదేశీ విద్యార్థులకు టైర్-4 వీసా నిబంధనలను మరింత సరళతరం చేస్తున్నట్టు తెలిపింది. ఈ సడలింపులను 25 దేశాలకు పరిమితం చేస్తూ వాటిని తక్కువ ప్రమాద దేశాలుగా అభివర్ణించింది. అయితే ఈ జాబితాలో భారత్‌ కు మాత్రం చోటు కల్పించలేదు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భారతీయులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

బ్రిటన్ సడలింపునిస్తున్న దేశాలలో ఇప్పటికే అమెరికా - కెనడా - న్యూజిలాండ్ ఉండగా తాజాగా చైనా - బహ్రెయిన్ - సెర్బియా వంటి దేశాలకు స్థానం లభించింది. ఈ దేశాలకు చెందిన విద్యార్థుల విద్యాపరమైన - ఆర్థికపరమైన అంశాలలో తనిఖీలు తక్కువగా ఉంటాయి. అలాగే బ్రిటీష్ యూనివర్సిటీల్లో చదువుకోవడానికి అవసరమైన ఆంగ్ల భాషలో నైపుణ్యం విషయంలో కూడా వీరికి సడలింపు ఉంటుంది. ఈ మార్పులు వచ్చే జూలై 6నుంచి అమలులోకి రానున్నాయి. ఈ సడలింపుల నేపథ్యంలో మరింతమంది అంతర్జాతీయ విద్యార్థులు చదువుకోవడానికి బ్రిటన్‌ కు వస్తారని ఆ దేశం ఆశిస్తోంది. ఈ జాబితాలో భారత్ లేకపోవడంతో బ్రిటన్ యూనివర్సిటీల్లో అవే కోర్సులకు దరఖాస్తు చేసుకొనే మన దేశ విద్యార్థులు కఠినమైన తనిఖీలను ఎదుర్కోనున్నారు.

భారత సంతతికి చెందిన కరణ్ బిలిమోరియా కోబ్రా బీర్ వ్యవస్థాపకునిగా - ఇండియా-బ్రిటన్ బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ) వ్యవస్థాపక చైర్మన్‌ గా ఉన్నారు. బ్రిటన్ నిర్ణయాలు భారత్‌ను అవమానించడమేనని లార్డ్ కరణ్ బిలిమోరియా పేర్కొన్నారు. ఇది బ్రిటన్ ఆర్థిక నిరక్షరాస్యతకు - ఇమ్మిగ్రేషన్ పట్ల ప్రతికూల వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. టైర్-4 చర్యల నుంచి భారత్‌ను మినహాయించడం కొరుకుడుపడని అంశం అని అన్నారు. బ్రెగ్జిట్ అనంతరం భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్న సమయంలో బ్రిటన్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వంచనకు నిదర్శనమని బిలిమోరియా యూకే కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అఫెయిర్ (యూకేసీఐఎస్‌ ఏ) అధ్యక్షుడు దుయ్యబట్టారు. భారత్ ఎప్పుడూ బ్రిటన్‌కు అత్యంత సన్నిహిత దేశాలలో ఒకటిగా, వర్ధమాన ఆర్థిక శక్తిగా ఉన్నదని ఆయన గుర్తు చేశారు. వీసా నిబంధనల సడలింపు జాబితాలో భారత్‌ ను చేర్చకపోవడం ఉభయ దేశాల మద్యనున్న ప్రత్యేక సంబంధాలను ధ్వంసం చేయడమేనని పేర్కొన్నారు. బ్రిటన్ చర్యను నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ - అలుమ్ని యూనియన్ (ఎన్‌ ఐఎస్‌ ఏయూ) కూడా తీవ్రంగా ఖండించింది. భారతీయ విద్యార్థులను బ్రిటన్ అధిక ప్రమాదకారులుగా పరిగణించిందని ఆ సంస్థ మండిపడింది. వీసా నిబంధనల్లో మార్పు వల్ల భారతీయ విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియలో ఎటువంటి మార్పు ఉండదని పేర్కొంది.

ఇదిలాఉండ‌గా...బ్రిటన్ యూనివర్సిటీలకు ఉన్నత చదువుల కోసం అధిక సంఖ్యలో వచ్చే విదేశీ విద్యార్థుల్లో అత్యధిక శాతం అమెరికా - చైనా - భారత్‌ కు చెందిన వారే ఉంటున్నారు. గత ఏడాది 15,171 మంది భారతీయ విద్యార్థులు టైర్-4 వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆరేళ్ల‌ క్రితం ఈ సంఖ్య 30వేలుగా ఉంది. అంటే గత ఆరేళ్లుగా బ్రిటన్‌ లో చదువుకొనే భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. వీసా నిబంధనల సడలింపును భారత్‌కు ఎందుకు వర్తింపజేయలేదన్న ప్రశ్నకు హోం శాఖ ప్రతినిధి బదులిస్తూ ``భారతీయ విద్యార్థులను మేము ఆహ్వానిస్తున్నాం. చైనా - అమెరికా తరువాత భారతీయ విద్యార్థులకే అధిక సంఖ్యలో వీసాలు జారీ చేస్తున్నాం. దరఖాస్తు చేసుకొనే 90 శాతం విద్యార్థులకు తప్పకుండా వీసా లభిస్తుంది`` అని చెప్పారు.