Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌భుత్వానికి కొత్త స‌మ‌స్య‌

By:  Tupaki Desk   |   23 Jan 2017 7:15 AM GMT
ఏపీ ప్ర‌భుత్వానికి కొత్త స‌మ‌స్య‌
X
సాగు - తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ముందుకు సాగుతున్న తెలుగు రాష్ట్రాల్లో భూసేక‌ర‌ణను నిర‌సించ‌డం, ప‌రిహారంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డం వంటి కార‌ణాల‌తో ఆందోళ‌న జ‌రుగుతుండ‌టం తెలిసిందే. అయితే తెలంగాణ జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల కంటే ఏపీలోనే ఎక్కువ‌గా ర‌చ్చ‌రచ్చ అవుతోంద‌ని అంటున్నారు. తాజాగా వంశధార రిజర్వాయర్ నిర్మాణ పనులను నిర‌సిస్తూ ఆస్తులు ద‌గ్దం చేయ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుండా పోలీసుల పహరాతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో సహనం కోల్పోయిన నిర్వాసితులు ఆగ్రహం ఉగ్రరూపం దాల్చింది. రిజర్వాయర్ నిర్మాణ చరిత్రలో లేని విధంగా వంశధార నిర్వాసితులు కట్టలు తెంచుకోవడంతో ఆందోళనలు పెల్లుబికాయి. సోమా గుత్తేదారుల ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి.

వంశ‌ధార ప్రాజెక్టు నిర్వాసితుల ప్రతిఘటనతో హిరమండలం - ఎల్.ఎన్‌ పేట మండలాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఉద్యమాన్ని అదుపుచేయాల్సిన పోలీసులు చేతులెత్తేసిన పరిస్థితులు నెలకొన్నాయి. హిరమండలం మండలంలోని బర్రిపేట - పెద్దసంకిలి - చిన్నసంకిలి - గదబపేట - దుగ్గుపురం - పాడలి - తులగాం - గార్లపాడు - చిన్నకొల్లివలస - గొట్టాబ్యారేజ్ జంక్షన్ - కొత్తూరు మండలం కృష్ణాపురం - హిరమండలం నిర్వాసితుల గ్రామాల నుంచి వేలాది మంది నిర్వాసితులు గొట్టాబ్యారేజ్ జంక్షన్‌కు చేరుకొని ఆందోళన చేపట్టారు. కార్మికమంత్రి అచ్చెన్నాయుడు - ఎమ్మెల్యే కలమట వెంకటరమణ దిష్టిబొమ్మలను ఊరేగింపు చేపట్టి దగ్దం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ బ్యానర్లు - ఫ్లెక్సీలను కాల్చివేశారు. ఆందోళనకారులు గొట్టాబ్యారేజ్ జంక్షన్ వెనుక భాగంలో స్పిల్‌వే పనుల వద్ద పొక్లయినర్ వాహనాల అద్దాలను పగులకొట్టడంతో పాటు పలు పరికరాలకు నిప్పు అంటించారు. అక్కడ నుంచి ఊరేగింపుగా కర్రలతో తరలివచ్చిన మహిళలు - పెద్దలు - చిన్నారులతో హిరమండలం ప్రధాన రహదారి మీదుగా ర్యాలీగా వస్తూ స్థానిక పోలీస్‌ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. అలాగే తహశీల్దార్ కార్యాలయ సముదాయంలోని ఎంపిడి ఒ - విద్యాశాఖ - తహశీల్దార్ కార్యాలయాల తలుపులు - కుర్చీలు - అద్దాలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. సోమా కంపెనీకి సంబంధించిన వాహనాలకు నిప్పంటించారు.

ఇదిలాఉండ‌గా అంత‌కుముందు రోజు పెద్ద ఎత్తున్నే ఆందోళ‌న చేశారు. ప్యాకేజీ - పరిహారం ఇవ్వకుండా.. చట్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ వంశధార నిర్వాసితులు తిరగబడ్డారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలతో పెద్దఎత్తున పోలీసులను మోహరించినా, వారి హెచ్చరికలను బేఖాతరు చేస్తూ నిర్వాసితులు వంశధార ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. ప్రజా ప్రతిఘటనకు తలొగ్గిన అధికారులు చివరకు పనులను నిలిపివేశారు. డీఎస్‌పీల నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బలగాల నడుమ వంశధార రిజర్వాయర్‌ పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న నిర్వాసితులు పనులు చేపట్టే ప్రాంతానికి పెద్దఎత్తున తరలివచ్చారు. పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని నినాదాలు చేస్తూ డైవర్షన్‌ బోర్డులను తొలగించి - తవ్విన రహదారిని పూడ్చివేశారు. పనులు అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించినా పట్టించుకోకుండా రిజర్వాయర్‌ స్పిల్‌వే వద్దకు చేరుకొని పనులను అడ్డుకున్నారు. నిర్వాసితులు పెద్దఎత్తున తరలి రావడంతో పోలీసులూ ప్రేక్షకపాత్రకే పరిమితయ్యారు. విషయం తెలుసుకున్న ఆర్‌డీఒ నిర్వాసితులతో చర్చలు జరప‌గా.. తమ సమస్యలను పరిష్కరించాకే పనులు చేపట్టాలని నిర్వాసితులు ముక్తకంఠంతో ఖరాకండిగా తేల్చిచెప్పారు. చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో అధికారులు పనులు నిలిపివేసి వెనుదిరిగారు. ఆ మ‌రుస‌టి రోజే ఈ ఉదంతం జ‌రిగింది.

ఇదిలాఉండ‌గా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం విష‌యంలో ఆందోళ‌న‌కే ప‌రిమితం అవుతుండ‌గా ఏపీలో ఏకంగా ఆస్తుల‌ను ద‌గ్దం చేయ‌డం వ‌ర‌కు ప‌రిస్థితి చేరిపోవ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఈ విష‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కంటే ఎక్కువ‌గా నిర‌స‌న ఎదుర్కోవాల్సి వ‌స్తున్న‌ద‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/