Begin typing your search above and press return to search.

తెలంగాణలో ప్రతిపక్షాల విజయం

By:  Tupaki Desk   |   5 Oct 2015 5:30 PM GMT
తెలంగాణలో ప్రతిపక్షాల విజయం
X
పార్లమెంటును - అసెంబ్లీని ఎంత సమర్థంగా ఎదుర్కొన్నామన్నదే అధికార పక్షాలకు గీటురాయి. మిగిలిన సమయాల్లో ప్రతిపక్షాలు నాలుగు విమర్శలు చేస్తే అధికార పక్షం ఆరు విమర్శలు చేస్తుంది. ఇరువురి వాదనలూ ప్రజలు వింటారు. ఇక్కడ ఒక్కొక్కరూ ఒక్కో రకమైన వాదన వినిపించవచ్చు. దానిని బట్టి ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు. అయితే, అసెంబ్లీలో మాత్రం ఎంత చర్చ జరిగినా, అంతిమంగా ఒక ఫలితం కోసం ప్రయత్నిస్తారు. అప్పుడే ఎవరిది పైచేయి అనేది తేలుస్తారు. ఇక్కడ చర్చ నుంచి ఎవరు పారిపోయారన్న విషయాలను కూడా ప్రజలు గమనిస్తారు.

తెలంగాణ ఆవిర్భవించిన తొలిరోజు నుంచి ప్రతిపక్షాలను అసెంబ్లీకి దూరం చేయడానికే అధికార పక్షం ప్రయత్నిస్తోంది. ఉదాహరణకు టీడీపీకి చెందిన రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా మాట్లాడతాడు. లాజిక్ తో అధికార పక్షాన్ని నిలదీస్తాడు. అతడు ఒక్కడూ మాట్లాడకుండా ఉంటే అసెంబ్లీలో మిగిలిన వాళ్లు పెద్దగా మాట్లాడరు. మాట్లాడే వాళ్లను మనం మేనేజ్ చేసేయవచ్చని అధికార పక్షం భావించింది. అందుకే రేవంత్ రెడ్డిని మాట్లాడకుండా చేయడానికి శతథా ప్రయత్నించింది. తద్వారా అసెంబ్లీ నుంచి గట్టెక్కామని భావించింది. కానీ, అధికార పక్షం కంటే రేవంత్ రెడ్డికే అప్పుడు ప్రజల్లో ఎక్కువ మార్కులు పడ్డాయి.

మరొక సందర్భంలో ప్రభుత్వం పైచేయి సాధించినా.. అప్పట్లో అధికార పక్షంలోని కొంతమంది కీలక నాయకులతో ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రజలకు సుస్పష్టంగా స్పష్టమైంది.

తాజాగా చర్చ అయితే ఎంతైనా చర్చిస్తామని, రచ్చ చేయాలని చూస్తే మాత్రం వేటు వేస్తామని సమావేశాలకు ముందు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ప్రతిపక్షాలు కోరుకునేది కూడా చర్చ మాత్రమే. చర్చించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాయి. అయితే ఈ విషయంలో ప్రభుత్వం దగ్గర ఎటువంటి సమాధానం లేదు. కనక అది రచ్చగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలను అన్నిటినీ సస్పెండ్ చేసి పారేసింది. తద్వారా తెలంగాణలో ఇప్పటి వరకు అధికార పార్టీపై ప్రతిపక్షాలే విజయం సాధిస్తూ వస్తున్నాయి.