Begin typing your search above and press return to search.

ఉప ఎన్నిక‌లో సంచ‌ల‌న పోస్ట‌ర్‌

By:  Tupaki Desk   |   29 April 2016 11:52 AM GMT
ఉప ఎన్నిక‌లో సంచ‌ల‌న పోస్ట‌ర్‌
X
ఒకే పోస్టర్‌ లో కాంగ్రెస్ నేతులు సోనియాగాంధీ - రాహుల్ గాంధీ - టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ - పార్టీ అధినేత‌ చంద్రబాబు - దివంగ‌త సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి - వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌ లు క‌లిసి ఏక‌బిగిన కాంగ్రెస్‌ కు ఓటు వేయమని ప్రజలకు పిలుపు ఇస్తే ఎలా ఉంటుంది? చూసేందుకు వింతగా అనిపించినా ఇప్పుడు అదే తెర‌మీద‌కు వ‌స్తోంది. ఖమ్మం జిల్లా పాలేరులో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో ఈ పోస్టర్ ఓ సంచలనంగా మారింది.

భవిష్యత్తు రాజకీయాలను ప్రతిబింబించే విధంగా ఉన్న ఈ పోస్టర్‌ లానే తెలంగాణ రాజకీయాలు మారనున్నాయని అంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన పార్లమెంటు - అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్ దక్కని పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం ఇదే పరిస్థితి. చివరకు గ్రేటర్ హైదరాబాద్‌ లో టీఆర్‌ ఎస్‌ కు గట్టి దెబ్బ తప్పదని ఆశించిన విపక్షాలు విస్తుపోయే విధంగా టీఆర్‌ ఎస్‌ కు 99 డివిజన్లలో విజయం లభించింది. తరువాత ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌ ను సైతం కైవసం చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో విపక్షాలు ప్రజా సమస్యలపై ఐక్య పోరాటాలు చేయడమే కాకుండా ఎన్నికల్లో సైతం కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి.శాసనమండలి ఎన్నికల్లో లోపాయికారిగా టీడీపీ - కాంగ్రెస్‌ కు పలు జిల్లాల్లో మద్దతు ఇచ్చిందని అభిప్రాయాలు వెలువ‌డ్డాయి. నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్‌ నగర్ జిల్లాలోని అచ్చంపేటలో మహాకూటమిగా అన్ని పార్టీలు ఏకమై టీఆర్‌ ఎస్‌ పై పోటీ చేశాయి. నల్లగొండలో మహాకూటమి కాస్త వర్కవుట్ అయి కాంగ్రెస్ అభ్య‌ర్థి గెలుపొందారు. కానీ అచ్చంపేటలో మాత్రం పని చేయలేదు. ఇక్కడ మొత్తం 20 వార్డుల్లోనూ టీఆర్‌ ఎస్ విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో వచ్చిన పాలేరు నియోజక వర్గం ఉప ఎన్నికల్లో విపక్షాలు మరోసారి ఏకమయ్యాయి. అధికారికంగానే టీడీపీ - వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. జిల్లాలో తొలుత టీఆర్‌ ఎస్ - టీడీపీ - కాంగ్రెస్‌ ల కన్నా వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ బలంగా ఉండేది. సాధారణ ఎన్నికల్లో జిల్లా నుంచి టీఆర్‌ ఎస్ ఒకే ఒక స్థానంలో విజయం సాధిస్తే - వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ మాత్రం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో - ఒక పార్లమెంటు స్థానాన్ని గెలుచుకుంది. కానీ టీఆర్‌ ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిస్థితులు మారాయి. దాంతో పాలేరు నుంచి పోటీ చేయవద్దని టీడీపీతో పాటు వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దీంతో జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఒకే పోస్టర్‌ పై కాంగ్రెస్ - టీడీపీ - వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ అగ్రనాయకుల ఫోటోలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ - కాంగ్రెస్‌ ను చీల్చి ఆవిర్భవించిన వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ - ఈ రెండు పార్టీలను వ్యతిరేకించే కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఒకటిగా మారి ప్రచారం సాగిస్తున్నాయి. వామపక్షాలు మాత్రం ఎవరితోనూ చేతులు కలపకుండా పోటీ చేస్తున్నాయి. సీపీఐ మద్దతుతో సిపిఎం పోటీ చేస్తోంది. ఇక బిజెపి నేరుగా ఎవరికీ మద్దతు ఇవ్వవలేదు. విపక్షాల ఓట్లు చీలకుండా బీజేపీ పోటీకి దూరంగానే ఉండడం ద్వారా టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులకు పరోక్షంగా మద్దతు ప్రకటించింది. మొత్తంగా టీఆర్‌ఎస్ ఒకవైపు, విపక్షాలన్నీ ఒకవైపు చేరి చేస్తున్న పోటీ రసవత్తరంగా మారింది.

పాలేరు ప్రయోగం విజయవంతం అయితే సాధారణ ఎన్నికల నాటికి విపక్షాలు ఏకమై పోటీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. పరోక్షంగా మద్దతు ఇవ్వడం, పంచాయితీల్లో మహాకూటమిగా ఏర్పడి పోటీ చేయడం వేరు, అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ వేరుగా ఉంటుందని, విపక్షాల ఐక్యత కచ్చితంగా టీఆర్‌ఎస్ దూకుడును తగ్గిస్తుందని విపక్షాల నాయకులు నమ్ముతున్నారు.