Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌2...కేసీఆర్ టార్గెట్ వారే

By:  Tupaki Desk   |   18 Dec 2018 5:15 AM GMT
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌2...కేసీఆర్ టార్గెట్  వారే
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పార్ట్ 2 ప్రారంభించారా? 2014 కంటే భిన్నంగా ఈ ద‌పా మ‌రింత వేగంగా, వ్యూహాత్మ‌కంగా ఈ ఎత్త‌గ‌డ ఉండ‌నుందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్‌ కాంగ్రెస్‌, టీడీపీ, బీఎస్పీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, నిధులు, ఇతర కార్పొరేషన్ల చైర్మెన్ల పదవులను ఆశ చూపి బలం పెంచుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో 63 సీట్లు ఉండగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో 93కు బలం పెరిగింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌ మరోసారి తన రాజకీయ చతురతను చాటాలని భావిస్తున్నది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేల‌ను త‌న గూటికి లాగి ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా చేయాల‌నేది టీఆర్ఎస్ ర‌థ‌సార‌థి ఎత్తుగ‌డ అని తెలుస్తోంది.

119 ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు 88 స్థానాలున్నాయి. నియోజకవర్గాల అభివృద్ధి కోసమంటూ ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కారు బలం 90కి చేరింది. కాగా సభలో కాంగ్రెస్‌ 19 - టీడీపీ 2 - ఎంఐఎం 7 - బీజేపీ ఒక ఎమ్మెల్యేను కలిగి ఉన్నాయి. ఈ విప‌క్ష ఎమ్మెల్యేల్లో 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకోవడానికి టీఆర్ఎస్‌ ప్రయత్నాలు చేస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. సాధ్యమైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో లాగి, కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదాకు గండికొట్టాలని భావిస్తున్నట్టు చెప్పుకొంటున్నారు. ప్రతిపక్ష హోదా రావాలంటే మొత్తం స్థానాల్లో నుంచి 10 శాతం సీట్లు వస్తే ఆ హోదాకు అర్హత వస్తుంది. అంటే 12 సీట్లు ఉంటే చాలు. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 19 స్థానాలున్నాయి. అయితే టీఆర్ఎస్‌ మాత్రం కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కకుండా పావులు కదుపుతూ కాంగ్రెస్‌ను చావుదెబ్బ తీసేందుకు ఎత్తుగ‌డ వేస్తోంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ చేరిక‌లు ఉండ‌నున్నాయ‌ని పేర్కొంటున్నారు.