Begin typing your search above and press return to search.

కోట్ల అక్ర‌మాల‌కు ల‌క్ష జ‌రిమానా!

By:  Tupaki Desk   |   17 Oct 2017 7:47 AM GMT
కోట్ల అక్ర‌మాల‌కు ల‌క్ష జ‌రిమానా!
X
అధికారంలో ఉన్న‌వారు మ‌న‌వారైతే.. మ‌నకు తిరుగులేద‌ని భావిస్తే.. ఇక అక్ర‌మాల‌కు తిరుగు ఏముంటుంది? ఏం చేసినా ఎవ‌రు అడుగుతారు? తాజాగా వెలుగు చూసిన ఘ‌ట‌న దీనినే ప్ర‌తిబింబించింది. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థ‌ల దోపిడీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. విద్య పేరుతో రూ.వంద‌ల‌ కోట్ల‌లో వ్యాపారం చేస్తున్నారు ఈ క‌ళాశాల‌ల యాజ‌మాన్యాలు. అయితే, వ్యాపారం చేసుకోవ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టరు. కానీ, నిబంధ‌న‌లు పాటించాలి. విద్యార్థుల‌కు స‌రైన మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాలి. ఆహ్లాద వాతావ‌ర‌ణంలో వారికి చ‌దువు చెప్పాలి. అంతే! అయితే, ఏపీలోని పేరెన్నిక‌గ‌న్న నారాయ‌ణ విద్యా సంస్థ‌లు నిబంధ‌న‌ల‌కు నీళ్లొదులుతున్నాయి. ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో వాటిపై చ‌ర్య‌లు తీసుకుని క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ప్ర‌భుత్వ యంత్రాంగం తూతూ మంత్రంగా జ‌రిమానాలు విధిస్తూ.. వాటినే అత్యంత క‌ఠిన శిక్ష‌లుగా ప్ర‌చారం చేస్తున్నారు. తాజాగా, విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం - రామాటాకీస్‌ రోడ్డు శ్రీనగర్‌ లో రెండు కళాశాలలు - హాస్టళ్లను నారాయణ యాజమాన్యం అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇక్క‌డ దాదాపు రెండు నుంచి మూడు వేల మంది విద్యార్థులు చ‌దువుతున్న‌ట్టు గుర్తించారు. దీంతో క‌ళాశాల‌కు నోటీసులు జారీ చేసినా.. అయినా స్పంద‌న క‌నిపించ‌లేదు. దీంతో కొన్ని చానెళ్లు - ప‌త్రిక‌ల్లో ఈ తతంగం ప్ర‌సార‌మైంది. ప్ర‌భుత్వంలో ఉన్న మంత్రికి చెందిన సంస్థ కావ‌డంతోనే చ‌ర్య‌లు తీసుకోవ‌డంలేద‌ని పెద్ద ఎత్తున క‌థ‌నాలు వ‌చ్చాయి.

దీంతో ఎట్ట‌కేల‌కు స్పందించిన మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కయ్యపాలెం హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.అక్క‌డిక‌క్క‌డే నారాయణ యాజమాన్యానికి - ఇంటర్‌ బోర్డు అధికారులకు చీవాట్లు పెట్టారు. రంగంలోకి దిగిన బోర్డు ఉన్నతాధికారులు ఓ ల‌క్ష రూపాయ‌లు జ‌రిమానాగా విధించారు. అయితే, వార్షిక ట‌ర్నోవ‌ర్ రూ. వంద‌ల కోట్ల‌లో నిర్వ‌హిస్తున్న కార్పొరేట్ సంస్థ‌పై రూ. ల‌క్ష జ‌రిమానా విధించి గొప్ప‌గా ప్ర‌చారం చేసుకోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.