Begin typing your search above and press return to search.

లోక్‌ సభ స్పీకరుగా ఓం బిర్లా!

By:  Tupaki Desk   |   18 Jun 2019 7:27 AM GMT
లోక్‌ సభ స్పీకరుగా ఓం బిర్లా!
X
లోక్ సభ స్పీకరు ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజస్థాన్‌ లోని కోటా ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యే అవకాశాలు కన్నిస్తున్నాయి. స్పీకర్‌ ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

17వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ప్రొటెం స్పీకర్‌ గా వీరేంద్ర కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత నూతన ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు. ఈ రోజు కూడా నూతన ఎంపీల ప్రమాణస్వీకారాలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక చేపట్టనున్నారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

కాగా లోక్‌ సభ స్పీకరు పదవికి పలువురి పేర్లు తొలుత వినిపించాయి. మేనకా గాంధీ సహా అనేక మంది భాజపా సీనియర్ల పేర్లు వినిపించాయి. జోయల్ ఓరం - మాజీ కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ - మాజీ మంత్రి పీపీ చౌదరి - ప్రొటెం స్పీకరు వీరేంద్ర కుమార్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే.. చివరకు ఓం బిర్లా వైపు ఎన్డీయే వర్గాలు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఓం బిర్లా కోటా నుంచి రెండు సార్లు లోక్‌ సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు కోటా దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌ నరైన్‌ మీనాపై బిర్లా విజయం సాధించారు.

వీరేంద్ర కుమార్ - జోయల్ ఓరంల నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరకు ఓం బిర్లా వైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. యూపీఏ హయాంలో అప్పటి ప్రొటెం స్పీకర్ సోమ్‌ నాథ్ చటర్జీని స్పీకర్‌ గా ఎంపిక చేసినట్లే ఎన్‌ డీఏ ప్రభుత్వం ఇప్పుడు వీరేంద్ర కుమార్‌ ను స్పీకర్‌ గా నియమించవచ్చునని భావించారు. లోక్‌ సభకు ఇంతవరకు ఏడుసార్లు ఎన్నికైన వీరేంద్ర కుమార్ మొదటి నుంచీ సంఘ్ పరివార్‌ తో ఉన్నారు. టీకమ్‌ ఘడ్ నుండి లోక్‌ సభకు ఎన్నికైన వీరేంద్ర కుమార్ 2014 ఎన్‌ డీఏ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పని చేశారు. సంఘ్ పరివార్‌ కు అత్యంత సన్నిహితుడైన వీరేంద్ర కుమార్‌ ను స్పీకర్‌ గా ఎంపిక చేస్తారానుకున్నారు. అలాగే... ఒడిశాకు చెందిన గిరిజన నేత జోయల్ ఓరం కూడా ఇవ్వొచ్చనుకున్నారు. గిరిజనులకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా అవుతుందని భావించారు. కానీ.. ఒడిశా నుంచి ఇప్పటికే ఇద్దరికి మంత్రి పదవులు రావడంతో ఆ ఆలోచన మానుకున్నట్లు సమాచారం.