Begin typing your search above and press return to search.

కిమ్ క్షిప‌ణి ల‌క్ష్యం నుంచి త‌ప్పించుకున్న‌ విమానం

By:  Tupaki Desk   |   17 Jan 2018 10:03 AM GMT
కిమ్ క్షిప‌ణి ల‌క్ష్యం నుంచి త‌ప్పించుకున్న‌ విమానం
X
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఏం చేసినా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌నే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. యుద్ధానికి స‌న్న‌ద్ధ‌మైన స‌మ‌యంలో త‌న‌దైన శైలిలో బెదిరింపుల‌కు దిగిన కిమ్‌....ఇటీవ‌ల‌ చ‌ర్చ‌ల విష‌యంలోనూ అదే ప్ర‌త్యేక‌త‌ను కొన‌సాగించారు. రెండు కొరియా దేశాల మధ్య రెండేళ్లుగా తెగిపోయిన స్నేహ సంబంధాల పునరుద్ధరణకు మార్గాలు తెరుచుకుంటున్నాయని అనుకుంటున్న స‌మ‌యంలోనే మ‌రో పిడుగులాంటి వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. హాంకాంగ్‌ కు చెందిన ఓ విమానం ఉత్త‌ర‌కొరియా మిస్సైల్ ల‌క్ష్యం నుంచి తృటిలో త‌ప్పించుకుంద‌ని వార్త‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

ఐక్య‌రాజ్య‌స‌మితి హెచ్చ‌రిక‌లు జారీచేస్తున్న‌ప్ప‌టికీ...కిమ్ త‌న క్షిప‌ణి ప్ర‌యోగాలు కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో గత ఏడాది నవంబర్ 28న ఉత్తర కొరియా ఒక ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. అయితే ఈ స‌మ‌యంలో అది ప‌లు విమానాల ప్ర‌యాణ మార్గానికి అతి స‌మీపంగా వెల్లి క‌ల‌క‌లం రేకెత్తించింది. అమెరికాకు చెందిన‌ ఫెడరల్ ఏవియేషన్ అధికారుల వివరాల ప్రకారం..ఉత్త‌రకొరియా క్షిపణి రేంజ్ లోనే హాంకాంగ్‌ కు చెందిన విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరి హాంకాంగ్ వెళుతోంది. ఈ విమానానికి కేవలం 280 నాటికల్ మైళ్ల దూరంలో ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణి కూడా ప్రయాణించింద‌ట‌. అంతేకాదు, ఆ రోజు అదే దారిలో మరో 9 విమానాలు కూడా వెళుతున్నాయట. ఆ రోజు మొత్తం 716 విమానాలు ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణి రేంజ్‌ లోనే ప్రయాణించాయని అధికారులు తెలిపారు. త‌ద్వారా వారంద‌రి ప్రాణాల‌ను కిమ్ బ‌లిగొనే స్థాయికి చేరార‌ని వ్యాఖ్యానించారు.

దీనిపై యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్సన్ తీవ్రంగా మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం వ‌ల్ల‌ అప్పటికప్పుడు పలు విమానాల మార్గాలను మార్చాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. హాంకాంగ్‌ కు చెందిన విమానం జపాన్ తీర ప్రాంతానికి 155 మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని, విమానంలోని ప్రయాణికులు మిస్సైల్‌ ను చూడగానే భయకంపితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చోవలసి వచ్చిందని టిల్లర్సన్ పేర్కొన్నారు. కిమ్ ఇలాంటి చేష్టలు మానుకోక‌పోతే...మ‌రిన్ని చ‌ర్య‌ల‌కు దిగాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

మ‌రోవైపు త‌మ ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌ను అమెరికా మ‌రింత బ‌లోపేతం చేస్తోంది. యుద్ధ నౌకల్ని(రొనాల్డ్‌ రీగన్‌) - అణు జలాంతర్గాముల్ని (మిచిగాన్‌) కొరియా ద్వీపకల్పంలో మోహరిస్తోంది. అత్యంత పెద్దదైన - శక్తివంతమైన మిచిగాన్‌ జలాంతర్గామిని దక్షిణా కొరియా తీరానికి అమెరికా చేర్చిందంటే దాని అర్థం - ఉత్తర కొరియాపై ఎప్పు డైనా - ఏ క్షణమైనా దాడులు చేస్తామని బెదిరించటమేన‌ని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన జలాంతర్గామిగా 'మిచిగాన్‌'కు గుర్తింపు ఉంది. మిచిగాన్‌ జలాంతర్గామి అత్యున్నత స్థాయి సాంకేతిక - సమాచార వ్యవస్థను కలిగి ఉంది.మిచిగాన్‌ అణుజలాంతర్గామికి ఉన్న మరో ప్రత్యేకత - సైనిక బలగాల ప్రత్యేక ఆపరేషన్‌ కు మద్దతుగా దాడుల్లో పాలుపంచుకుంటుంది. దీనినుండి జరిగే అత్యంత భీకరమైన క్షిపణి దాడుల్ని అడ్డుకోవటం సామాన్య విషయం కాదు.మ‌రోవైపు నెవాడా గగనతలంలో ఎగురుతున్న విమానాల నుంచి సైనికులు ప్యారాచూట్లతో దూకేస్తున్నారు. అత్యవసర సమయాల్లో మొబిలైజేషన్‌ సెంటర్లను ఎలా ఏర్పాటు చేయాలో కసరత్తు చేసేందుకు అమెరికాలోని ఆర్మీ రిజర్వు దళాలు సిద్ధమవుతున్నాయి! ఉత్తరకరొలినా రాష్ట్రంలో ఉన్న ఫోర్ట్‌ బ్రాగ్‌ ప్రాంతంలో అపాచీ గన్‌ షిప్‌ హెలికాప్టర్లు - చినూక్‌ కార్గో హెలికాప్టర్లు తరచూ విన్యాసాలు నిర్వహిస్తూ స‌ర్వం సిద్ధంగా ఉంటున్నాయి.

కాగా, 2018 కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల్లో పాల్గొని అమెరికాపై వేయడానికి న్యూక్లియర్ బాంబు స్విచ్ తన టేబుల్‌ పైనే సిద్ధంగా ఉంటుందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. నూతన ఏడాదిలో భారీగా అణ్వాయుధాలను, ఖండాంతర క్షిపణులను తయారు చేయాలని ఉత్తరకొరియా శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో అమెరికా కూడా స‌ర్వ‌స‌న్న‌ద్ధం అవుతోంది. కొరియా ద్వీప‌క‌ల్పంలో సైనిక చ‌ర్య‌కు సిద్ధంగా ఉండాల‌ని అమెరికా రక్ష‌ణ శాఖా మంత్రిజిమ్ మాటిస్ సూచించిన‌ట్లు పెంటగాన్ వెల్ల‌డించింది.