Begin typing your search above and press return to search.

అమ్మ మృతి వెనుక మ‌న్నార్ మాఫియా?

By:  Tupaki Desk   |   23 Sep 2017 4:34 PM GMT
అమ్మ మృతి వెనుక మ‌న్నార్ మాఫియా?
X
త‌మిళ‌నాడులో మాజీ ముఖ్య‌మంత్రి మ‌ర‌ణానంత‌రం రాజ‌కీయ ప‌రిణామాలు రోజుకో కొత్త మ‌లుపు తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామి ఎన్నాళ్లు ప‌ద‌విలో ఉంటారు? క‌మ‌ల్ సీఎం అవుతారా? ర‌జ‌నీ రాజకీయాల్లోకి వ‌స్తారా? అన్న విష‌యాల‌పైనే అంద‌రి దృష్టి కేంద్రీకృత‌మై ఉంది. అయితే, అమ్మ అభిమానుల‌కు మాత్రం ఆమె మృతిపై ఉన్న అనుమానాలు నివృత్తి కాలేద‌న్న ఆవేద‌న అలాగే ఉంది. గ‌తంలో జ‌య‌ల‌లిత మృతి వెనుక ఉన్న నిజాల‌ను నిగ్గు తేల్చాల‌న్న నాయ‌కులు ఇపుడు ఆ విష‌యాల‌ను మరుగున‌ప‌డేశారు. అమ్మ‌కు వీరాభిమాని అయిన ప‌న్నీర్ సెల్వం సైతం కంటితుడుపు ప్ర‌క‌ట‌న‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. ప‌న్నీర్ తో దోస్తీ క‌ట్టిన ప‌ళ‌ని స్వామి కూడా అమ్మ మృతిపై ప్ర‌జ‌ల‌కు ఉన్న సందేహాల‌ను తీర్చేందుకు ఎందుకు ఆస‌క్తి చూప‌డం లేదో అమ్మ అభిమానుల‌కు అర్థం కాని ప‌రిస్థితి. ల‌క్ష‌లాదిమంది అమ్మ అభిమానుల‌ను ఇటువంటి భేతాళ ప్ర‌శ్న‌లు వేధిస్తూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అన్నాడీఎంకే కీలక నేత దిండిగల్‌ శ్రీనివాసన్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో ఆయ‌న వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని రేపాయి.

గత ఏడాది సెప్టెంబర్‌ 22న జయలలిత తీవ్ర అనారోగ్యానికి గురైన సంగ‌తి తెలిసిందే. అదే రోజున ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అన్నాడీఎంకే నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న శ్రీనివాసన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమ్మ ఆస్పత్రిలో ఉన్న సమయంలో తాను మీడియా సాక్షిగా అబ‌ద్ధ‌పు ప్ర‌క‌ట‌న‌లు చేశానని శ్రీ‌నివాస‌న్‌ చెప్పారు. ఆ సమయంలో ప్ర‌జ‌లు తీవ్ర ఉద్వేగానికి లోనై ఉన్నార‌ని, సోషల్‌ మీడియాలో అమ్మ ఆరోగ్యంపై తీవ్రంగా పుకార్లు చెలరేగాయ‌ని గుర్తు చేశారు. ఆ పరిస్థితుల్లో గ‌త్యంత‌రం లేక పార్టీని కాపాడుకునేందుకు ఏఐడీఎంకే కీలక నేతలు అమ్మ ఆరోగ్యంపై త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేశార‌ని తెలిపారు. అమ్మ ఆరోగ్యం బాగానే ఉంద‌ని, ఆమె త్వ‌ర‌లోనే కోలుకుంటుందని వాస్త‌వ విరుద్ధ‌మైన‌ ప్రకటనలు చేశారు. కానీ, నిజానికి లోపల ఏం జరిగింది? ఆమె ఎలా ఉంది? అన్న విష‌యాలు ఎవరికీ తెలియని పరిస్థితి ఉంద‌ని శ్రీనివాసన్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

అమ్మ‌కు చికిత్స జ‌రుగుతున్న ఆస్ప‌త్రిలోకి వీవీఐపీల‌ను సైతం అనుమతించ‌లేదని శ్రీ‌నివాస‌న్ తెలిపారు. శ‌శిక‌ళ ప్ర‌ముఖులంద‌రినీ జ‌య‌ల‌లిత ఉన్న అంత‌స్తులోకి ఎవ‌రినీ రానివ్వ‌కుండా అడ్డుకున్నార‌ని చెప్పారు ‘జయల‌లిత‌కు చికిత్స జరుగుతున్న సమయంలో ఆమె ఉన్న అంతస్తులోకి ఎవరినీ అనుమతించలేదు. గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు సహా అమిత్‌ షా, రాహుల్‌ గాంధీ, అరుణ​ జైట్లీల‌ను కూడా అమ్మ‌ను చూడనివ్వకుండా శశికళ అడ్డుకున్నారు. వారందరినీ ప్రతాప్‌రెడ్డి గదిలో కూర్చోబెట్టి ఆమె మాట్లాడారు. అమ్మ మృతి వెనుక ముమ్మాటికీ శశికళ, దినకరన్‌ హస్తం ఉంది’’ అని శ్రీనివాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రీ‌నివాస‌న్ వ్యాఖ్య‌ల‌తో అమ్మ మ‌ర‌ణం వెనుక‌ మ‌న్నార్ గుడి మాఫియా ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మైంద‌ని త‌మిళ ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. జ‌య‌ల‌లిత ఆస్ప‌త్రిలో ఉన్న 3 నెల‌ల కాలంలో చివ‌రి ప‌ది రోజులు మిన‌హా మిగిలిన రోజుల్లో కాన్షియ‌స్ గానే ఉన్నార‌న్న ప్ర‌క‌ట‌న‌లు అబ‌ద్ధ‌మ‌ని అనుకుంటున్నారు. ప్ర‌జ‌ల ఆశీస్సుల‌తో అమ్మకు పున‌ర్జ‌న్మ ల‌భించింద‌ని, ఆమె త్వ‌ర‌లోనే కోలుకుంటుంద‌ని దుష్ప్ర‌చారం చేశార‌ని చెప్పుకుంటున్నారు. కాగా, శ్రీ‌నివాస‌న్ ఆరోప‌ణ‌ల‌ను దిన‌క‌ర‌న్ ఖండించారు. అక్టోబర్‌ 1 తర్వాత శశికళ ....జయలలిత దగ్గర లేద‌ని చెప్పారు. జయను పరామర్శించినట్లుగా గవర్నరే ప్ర‌క‌టించిన విషయాన్ని గుర్తు చేశారు.