Begin typing your search above and press return to search.

పాక్ నటుల నిషేధంపై వెంకయ్య!

By:  Tupaki Desk   |   27 Oct 2016 4:46 AM GMT
పాక్ నటుల నిషేధంపై వెంకయ్య!
X
ఉరీ ఉగ్రదాడి అనంతరం బాలీవుడ్ లో పనిచేస్తోన్న పాకిస్థాన్ నటీనటులు భారత్ విడిచి వెళ్లిపోవాలని, పాక్ కళాకారులకు బాలీవుడ్ నిర్మాతలు - దర్శకులు ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని, వారు నటించే సినిమాలు విడుదలవ్వనివ్వం, అలాగే షూటింగులు కూడా జరగనివ్వం అంటూ మహారాష్ట్ర నవనిర్మాణసేన అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాలపై బాలీవుడ్ లో పెద్ద రచ్చే జరిగింది. వారిని నిషేదించాల్సిందే అని కొందరంటే... కళాకారులకు అలాంటివేమీ ఉండవని మరికొందరు సమర్ధించారు. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు.

పాకిస్థానీ నటీనటులు భారతదేశంలో పనిచేయకూడదంటూ ప్రభుత్వం నిషేధం ఏమీ విధించలేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇతరదేశాల కళాకారులపై ఎలాంటి నిషేధాలు విదించలేదు కానీ... వారితో పనిచేయించుకునే విషయంలో ప్రజల సెంటిమెంటును దర్శక నిర్మాతలు గౌరవించాలని చెప్పారు. ఇలా సూచన ప్రాయంగా చెప్పడంలో వెంకయ్య వాక్ చాతుర్యం బాగా పనిచేస్తుందనేది తెలిసిన విషయమే. అంటే... పాక్ నటులపై అధికారిక నిషేధం ఏమీ లేదుకానీ... ఈ విషయంలో బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎవరికి వారు ఆలోచించుకోవాలి అంటూనే, ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పారన్నమాట!

అలాగే, "ఏ దిల్ హై ముష్కిల్" సినిమా విడుదల విషయంలో ఎంఎన్ ఎస్‌ కు, ఆ సినిమా నిర్మాతకు మధ్యవర్తిత్వం జరపడంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎలాంటి తప్పు చేయలేదని.. తన వ్యక్తిగత విషయానికొస్తే, ఇతర దేశాల కళాకారులు మన దేశంలోని సినిమాల్లో పనిచేయడంపై నిషేధం విధించడానికి తాను అనుకూలం కాదని వెంకయ్య తెలిపారు. కళలకు హద్దులు లేవని అందరూ అంటారు... కానీ దేశాలకు మాత్రం ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.. ప్రజల సెంటిమెంట్లను హర్ట్ చేయకూడదు అని వెంకయ్య తెలిపారు.

ఇదే సమయంలో... సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ కుటుంబంలో జరుగుతున్న వివాదాలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించిన వెంకయ్య... వారి సొంత ఇంటి సమస్యలు పరిష్కరించుకోలేక తమ పార్టీపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/