Begin typing your search above and press return to search.

అధికార పార్టీ షాక్:అవిశ్వాసానికి మ‌ద్ద‌తివ్వం

By:  Tupaki Desk   |   20 March 2018 10:53 AM GMT
అధికార పార్టీ షాక్:అవిశ్వాసానికి మ‌ద్ద‌తివ్వం
X
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన టీడీపీ - వైసీపీలకు గట్టి దెబ్బే తగిలింది. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే స్పష్టంచేసింది. తమిళనాడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహరించిందని, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ల అవిశ్వాస తీర్మానానికి ఎలా మద్దతిస్తామని అన్నాడీఎంకే నేత పీ వేణుగోపాల్ అన్నారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే మేలు చేసే చర్య అని ఆయన చెప్పారు. తమ డిమాండ్ అంతా కావేరీ మేనేజ్‌ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలన్నదే అని వేణుగోపాల్ స్పష్టంచేశారు. దానికోసమే లోక్‌ సభలో తమ ఎంపీలు ఆందోళన చేస్తున్నారని, తమ డిమాండ్ నెరవేరే వరకు సభలో ఆందోళనలను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.

సభలో అన్నాడీఎంకే కావేరీ బోర్డు కోసం, టీఆర్‌ ఎస్ రిజర్వేషన్ల అంశంపై, టీడీపీ అవిశ్వాస తీర్మానంపై వెల్‌ లోకి దూసుకెళ్లి మరీ ఆందోళనలు చేస్తున్నారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానంపై చర్చను జరపలేకపోతున్నారు. మంగళవారం కూడా ఆందోళనలు కొనసాగడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. లోక్‌ సభలో అన్నాడీఎంకేకు 37 మంది సభ్యుల బలం ఉంది.

ఇదిలాఉండ‌గా...కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం మంచి నిర్ణ‌య‌మ‌ని పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధిగా ఉన్న కేసీ ప‌ళ‌నిస్వామి ఓ టీవీ చానల్‌లోని ప్ర‌క‌టించగా ఆయ‌న్ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. ఏపీ ఆకాంక్ష వ‌లే త‌మ రాష్ర్టానికి చెందిన కీల‌క స‌మ‌స్య అయిన కావేరీ నిర్వహణ మండలి ఏర్పాటు చెయ్యడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్షం చేస్తోందని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆహ్వానించ‌ద‌గిన చ‌ర్య అని పేర్కొన్నారు. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వానికి స‌న్నిహితంగా మారుతున్న అన్నాడీఎంకే వ‌ర్గాలు తాజాగా ఎంపీ, పార్టీ అధికార ప్ర‌తినిధి హోదాలో ప‌ళ‌నిస్వామి చేసిన కామెంట్‌కు షాక్ తిన్నాయి. దీంతో వెంట‌నే కేసీ పళనిస్వామిని పార్టీ నుంచి బహిష్కరించామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి - ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.