Begin typing your search above and press return to search.

స్మార్ట్ సిటీల ఎంపికలో ఏపీకి షాక్ ఇచ్చిన వెంకయ్య

By:  Tupaki Desk   |   24 May 2016 11:36 AM GMT
స్మార్ట్ సిటీల ఎంపికలో ఏపీకి షాక్ ఇచ్చిన వెంకయ్య
X
స్మార్ట్ సిటీ మిష‌న్ కార్య‌క్ర‌మం కింద ఆకర్షణీయ నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాల‌కు భిన్న‌మైన స్పంద‌న ద‌క్కింది. ఈ జాబితాలో తెలంగాణ‌లోని వరంగల్‌ కు చోటు లభించింది. అయితే ఆంధ్ర‌ప్రదేశ్‌ లోని ఏ న‌గ‌రం స్మార్ట్‌ సిటీ జాబితాలోకి ఎంపిక కాలేదు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో మొద‌టి విడ‌త‌గా స్మార్ట్ సిటీల‌ను ఎంపిక చేశారు. రెండో విడత ఆకర్షణీయ నగరాల జాబితాను తాజాగా కేంద్ర పట్ట‌ణాభివృద్ధి- పార్ల‌మెంటు వ్య‌వ‌హారాల మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 13 నగరాలు స్మార్ట్ సిటీలుగా ఎంపిక‌యిన‌ట్లు ప్రకటించారు. తెలంగాణలో వరంగల్‌ కు ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కిందని తెలిపారు. ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు కల్పించాలని పలువురు సీఎంలు కోరారని పేర్కొన్నారు. ఆయా పట్టణాల్లో అభివృద్ధి చేసి పోటీలో ఉండాలని సీఎంలకు సూచించానని వెంక‌య్య‌నాయుడు చెప్పారు. అక‌ర్ష‌ణీయ న‌గ‌రాల‌ పథకంలో ఈ ఏడాది మరో 7 పట్టణాలకు అవకాశం కల్పిస్తామన్నారు. ఆకర్షణీయ నగరాల జాబితాలో పాట్నా - సిమ్లా - నయా రాయ్‌ పూర్ - అమరావతి - బెంగళూరు - తిరువనంతపురం - ఈటానగర్ పోటీలో ఉన్నాయని పేర్కొన్నారు. పట్టణాలను శరవేగంగా అభివృద్ధి చేసుకుందామని వెంక‌య్య నాయుడు చెప్పారు. స్మార్ట్ సిటీస్ పథకానికి కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నామని పేర్కొన్నారు. పట్టణాల్లో సాంస్కృతిక పునరుజ్జీవన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

స్మార్ట్ సిటీల ఎంపిక‌లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఏ ఒక్క న‌గ‌రం చోటు సంపాదించుకోక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, తెలుగుదేశం పార్టీల మ‌ధ్య క్షీణిస్తున్న సంబంధాల‌కు ఈ ఎంపిక అద్దం ప‌డుతోంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.