Begin typing your search above and press return to search.

మోడీకి తాజాగా భారీ షాకిచ్చిన గుజ‌రాతీయులు

By:  Tupaki Desk   |   9 Dec 2017 4:54 AM GMT
మోడీకి తాజాగా భారీ షాకిచ్చిన గుజ‌రాతీయులు
X
ఊహించ‌ని షాక్‌. బీజేపీ నేత‌ల‌కు మాత్ర‌మే కాదు.. ప్ర‌ధాని మోడీకి కూడా. దేశ వ్యాప్తంగా తిరుగులేని నేత‌గా అభివ‌ర్ణించే మోడీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేంత‌గా షాకిచ్చారు గుజ‌రాతీయులు. గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీకి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో.. మొద‌టి ద‌శ పోలింగ్‌ కు కొన్ని గంట‌ల ముందు జ‌రిగిన ఒక స‌భ‌కు హాజ‌రైన స‌భికుల వ్య‌వ‌హారం ఇప్పుడు జాతీయ మీడియాలోనే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ భారీ సంచ‌ల‌నంగా మారింది. మోడీ ప్ర‌భ మ‌స‌క‌బారిందా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌య్యేలా.. సొంత రాష్ట్రంలోనే మోడీకి షాక్ త‌గల‌నుందా? అన్న అనుమానం వ‌చ్చేలా జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ క‌మ‌ల‌నాథుల్లో క‌ల‌వరాన్ని పుట్టిస్తోంది.

గుజరాత్ లోని బ‌రూచ్ జిల్లాలో ప్ర‌ధాని మోడీ స‌భ నిర్వ‌హించారు. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో నిర్వ‌హిస్తున్న‌భారీ బ‌హిరంగ స‌భ‌ల్లో బ‌రూచ్ జిల్లాలో ఏర్పాటు చేసిన స‌భ ఒక‌టి. ఈ స‌భ‌కు ల‌క్ష వ‌ర‌కూ ప్ర‌జ‌లు వ‌స్తార‌ని అంచ‌నా వేశారు. ఇందుకు త‌గ్గ‌ట్లే ఏర్పాట్లు చేశారు కూడా. అయితే.. మోడీ ప్ర‌సంగిస్తున్న వేళ‌కు.. స‌భ‌లో మొద‌టి మూడు వ‌రుస‌ల్లో మాత్ర‌మే స‌భికులు ఉండ‌టం.. గ్రౌండ్ మొత్తం ఖాళీ కావ‌ట‌మే కాదు.. మోడీ మాట్లాడుతున్న‌ప్పుడు జ‌నం లేచి వెళ్లిపోవ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ల‌క్ష మంది స‌భికులు హాజ‌ర‌వుతార‌న్న అంచ‌నాతో గ్రౌండ్ మొత్తం కుర్చీల‌తో నింపేయ‌గా.. మొద‌టి మూడు వ‌రుస‌లు మాత్ర‌మే నిండిపోవ‌టంతో క‌మ‌ల‌నాథుల‌కు షాకింగ్ గా మారింది. అయితే.. ఇలాంటి ప‌రిస్థితి కార‌ణం మోడీ మీద అభిమానం లేక‌పోవ‌టం కాద‌ని.. ఉద‌యం ప‌దిన్న‌ర‌కు రావాల్సిన మోడీ.. దాదాపు మూడు గంట‌ల పాటు ఆల‌స్యంగా రావ‌టంగా కొంద‌రు చెబుతున్నారు.

మూడు గంట‌ల ఆల‌స్యం పెద్ద విష‌యం కాద‌ని.. ఒక‌వేళ అంత ఆల‌స్య‌మైనా.. ల‌క్ష మందికి స‌గం మంది వెన‌క్కి వెళ్లిపోయినా యాభై వేల‌మంది అయినా ఉండాలి క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు. స‌భ మొత్తంలో మొద‌టి మూడు వ‌ర‌స‌లు కూడా నిండ‌క‌పోవ‌టం చూస్తే.. గుజ‌రాత్ లో వీస్తున్న బీజేపీ స‌ర్కారు వ్య‌తిరేక గాలికి నిద‌ర్శ‌నంగా కొంద‌రు అభివ‌ర్ణిస్తున్నారు. కార‌ణం ఏమైనా.. ఎన్నిక‌ల వేళ‌.. వెల‌వెల‌బోయిన మోడీ స‌భ ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.