Begin typing your search above and press return to search.

బీహార్ సీఎం రాజీనామా..సంక్షోభం దిశ‌గా ప‌య‌నం

By:  Tupaki Desk   |   26 July 2017 4:17 PM GMT
బీహార్ సీఎం రాజీనామా..సంక్షోభం దిశ‌గా ప‌య‌నం
X
బీహార్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితిష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఇన్‌ చార్జ్ గవర్నర్‌ కేసరి నాథ్ త్రిపాఠిను కలిసిన నితీష్ కుమార్ తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ రాజీనామా చేయాలని నితీష్ కోరగా - డిప్యూటీ సీఎం రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తేల్చి చెప్పాడు. ఆర్జేడీ - జేడీయూ మధ్య విభేదాలు రావడంతో నితీష్ రాజీనామా చేసినట్లు సమాచారం. రాజీనామాకు ముందు తేజస్వీ యాదవ్ వ్యవహారంలో నితిష్ కుమార్ న్యాయనిపుణులతో చర్చించారు.

కాగా, గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన అంనంతరం బీహార్ సీఎం నితిశ్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ``ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితు మధ్య పని చేయడం కష్టతరంగా మారింది. సంకీర్ణ ధర్మాన్ని పాటించేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నించాను` అని ఆయన తెలిపారు. ``సంకీర్ణ భాగస్వామి కాంగ్రెస్ పార్టీతో కూడా చర్చించా. రాహుల్ గాంధీతో స్వయంగా ఫోన్‌ లో మాట్లాడా. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సమస్య పరిష్కారం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపించేందుకు నా అంతరాత్మ అంగీకరించలేదు. ప్రజల చేత ఎన్నికైనవాళ్లం... ప్రజలకు సమాధానం చెప్పాలి. చివరి క్షణం వరకు సంక్షోభం పరిష్కారానికి ప్రయత్నించా. ప్రభుత్వాన్ని నడపగలిగినంతకాలం నడిపా. ఇక ప్రభుత్వాన్ని నడపటం నావల్ల కావటం లేదు. నోట్ల రద్దును నేను సమర్థించా. ఆ సమయంలో నాపై ఎలాంటి ఆరోపణలు చేశారో మీకు తెలుసు. నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలను నమ్మినవాడిని. చివరిక్షణం వరకు నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉంటాను`` తేల్చి చెప్పారు. బీహార్ గవర్నర్‌ ను రాష్ట్రపతిగా ఎంపిక చేసినందుకు గౌరవంతో సమర్థించానని తెలిపారు. మాకు ప్రత్యేకమైన అజెండా లేదు.. ఆలోచన అంతకన్నా లేదని పేర్కొన్నారు.

కాగా, ఐఆర్‌ సీటీసీ కేసులో లాలూతో పాటు తేజస్వి యాద‌వ్ కూడా సీబీఐ ద‌ర్యాప్తు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ డిప్యూటీ సీఎం తేజస్వీ రాజీనామా చేసే ప్రసక్తే లేదని లాలూ తేల్చి చెప్పాడు. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపలేనని నితీశ్ రాజీనామా చేశారు. అయితే నితీశ్‌కు మద్దతుగా బీజేపీ నిలిచింది. దీంతో బీహార్‌ మధ్యంతర ఎన్నికల దిశగా వెళ్తోంది. బీహార్‌ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉండగా - ఆర్జేడీ 80 - జేడీయూ 71 - బీజేపీ 53 - కాంగ్రెస్ 21 సీట్లు ఉన్నాయి.

మ‌రోవైపు త‌న‌ను ఎవ‌రూ రాజీనామా చేయాల‌ని కోర‌లేద‌ని బీహార్ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ అన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మ‌హాకూట‌మిని చీల్చాల‌ని బీజేపీ భావిస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. మ‌హాకూట‌మిని బ్రేక్ చేసేందుకు వాళ్లు కుట్ర ప‌న్నార‌న్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా తేజ‌స్వి రాజీనామా డిమాండ్ చేయ‌లేదు అని లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ అన్నారు. ఆర్జేడీ - జేడీయూ మ‌ధ్య బంధాన్ని ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నార‌ని లాలూ తెలిపారు. మ‌హాకూట‌మికి నితీశ్ నేత అని, ఆయ‌న ప‌ట్ల ఎటువంటి అమ‌ర్యాదగా వ్య‌వ‌హ‌రించినా స‌హించ‌బోమ‌న్నారు.