Begin typing your search above and press return to search.

మోడీతో మ‌ద్దతిచ్చి చిక్కుల్లో ప‌డ్డ సీఎం

By:  Tupaki Desk   |   22 Jun 2017 2:38 PM GMT
మోడీతో మ‌ద్దతిచ్చి చిక్కుల్లో ప‌డ్డ సీఎం
X
దేశ ప్ర‌థ‌మ పౌరుడి ఎన్నిక‌ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. యూపీకి చెందిన ద‌ళిత అభ్య‌ర్థిని ఎంపిక చేసి విప‌క్షాల‌ను చిక్కుల్లో ప‌డేసిన‌ట్లు భావించిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి.. కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని ప్ర‌తిప‌క్షాలు ద‌ళిత మ‌హిళ‌తో చెక్ పెట్టాయి. మాజీ లోక్‌ స‌భ స్పీక‌ర్ మీరా కుమార్‌ ను ప్ర‌తిప‌క్షాలు రంగంలోకి దించాయి. మాజీ ఉప ప్ర‌ధాని బాబు జ‌గ్జీవ‌న్‌ రామ్ కూతురు. 2004లో యూపీఏ ప్ర‌భుత్వంలో మీరాకుమార్‌.. సామాజిక న్యాయ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 2009లో లోక్‌ స‌భ‌కు తొలి మ‌హిళా స్పీక‌ర్ అయ్యారు.

ఎన్డీయే అభ్య‌ర్థి రామ్‌ నాథ్ కోవింద్‌ లాగే ఈమె కూడా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. రామ్‌ నాథ్ గ‌తంలో ఐఏఎస్‌ కు ఎంపికైన విష‌యం తెలిసిందే. మీరాకుమార్ కూడా ఇండియ‌న్ ఫారిన్ స‌ర్వీస్ అధికారి కావ‌డం విశేషం. ద‌ళిత అభ్య‌ర్థిని ఎంపిక చేసి ప్ర‌తిప‌క్షాల్లో చీలిక తీసుకు రావ‌డంలో మోడీ స‌ఫ‌ల‌మైనా.. మీరాకుమార్ ఎంపిక‌తో ప్ర‌తిప‌క్షాలు అంతే షాకిచ్చాయి. మీరాకుమార్‌ బీహార్‌ కు చెందిన వ్యక్తి. త‌మ‌కు షాకిస్తూ ఎన్డీయే అభ్య‌ర్థికి మద్ద‌తిచ్చిన బీహార్ సీఎం నితీశ్‌ ను కూడా ఈ ఎంపిక‌తో ప్ర‌తిప‌క్షాలు చిక్కుల్లో ప‌డేశాయి. ఇప్పుడు తాను యూపీకి చెందిన కోవింద్‌ కు ఎందుకు మ‌ద్ద‌తిస్తున్నారో తేల్చుకోవాల్సిన ప‌రిస్థితి నితీశ్‌ కు ఎదురైంది. త‌ద్వారా తమ గూటి నుంచి హ‌ఠాత్తుగా జంప్ చేసిన నితీశ్‌ కు అదే రీతిలో విప‌క్షాలు షాకిచ్చాయి.

అయితే ఇప్ప‌టికే రామ్‌ నాథ్ కోవింద్‌ ను గెలిపించ‌డానికి కావాల్సిన మ‌ద్ద‌తును ఎన్డీయే కూడ‌గ‌ట్ట‌డంతో ఇప్పుడు ఆయ‌న మెజార్టీపైనే అంద‌రి దృష్టి కేంద్రీకృత‌మైంది. జులై 17న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. 20న ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/