Begin typing your search above and press return to search.

చంద్రబాబొక్కడే మొగాడు కాదు

By:  Tupaki Desk   |   11 Feb 2019 5:49 AM GMT
చంద్రబాబొక్కడే మొగాడు కాదు
X
ఏపీ నుంచి రెండు రైళ్లలో జనాన్ని తరలించి దిల్లీలో ధర్మ పోరాట దీక్షకు కూర్చున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ టీడీపీకి చెందిన నాయకులు ఇదేదో కేవలం తమ ఒక్కరి ఘనత - దమ్ము - ధైర్యం అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం గతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ ఇంతగా పోరాడలేదని చెబుతున్నారు. అసలు దిల్లీకి వచ్చి కేంద్రాన్ని ఈ స్థాయిలో ఎదిరించిన మొగాడే లేడని చర్చించుకుంటున్నారు. కానీ... ఇందులో నిజమెంత? తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ ఇలా దిల్లీ వేదికగా భారీ కార్యక్రమాలు నిర్వహించలేదా? అంటే ఉన్నారనే చెప్పాలి. అంతేకాదు.. ఆ ర్యాలీలతో పోల్చితే చంద్రబాబు చేస్తున్న ప్రస్తుత దీక్షాపోరాటం చాలా చిన్నదనే చెప్పాలి.

2013 మార్చి 17న బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక ఇవ్వాల్సిందేనంటూ దిల్లీలో ‘అధికార్’ ర్యాలీ నిర్వహించారు. సుమారు 25 వేల మందితో ఆయన నిర్వహించిన ర్యాలీతో దిల్లీ దద్దరిల్లింది. అప్పటికి దేశంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు.

అది జరిగిన కొన్నాళ్లకే... అంటే, అదే ఏడాది జూన్ 12న ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం నాన్చుతోందంటూ ‘స్వాభిమాన్’ ర్యాలీ పేరుతో అంతకంటే పెద్ద కార్యక్రమం నిర్వహించారు. దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌ లో ఆయన నిర్వహించిన కార్యక్రమంలో 35 వేల మంది పాల్గొన్నారు. దిల్లీలో ఒక రాష్ట్రం ఇంత భారీగా నిరసన తెలపగలదా!అని అంతా ఆశ్చర్యపోయేలా స్వాభిమాన్ ర్యాలీ సాగింది. అప్పుడు కూడా మన్మోహనే ప్రధానిగా ఉన్నారు.

ఆ ఇద్దరు సీఎంలు దిల్లీని దద్దరిల్లేలా చేసినా కూడా వారికి ప్రత్యేక హోదా రాలేదన్నది వేరే విషయం. అయితే... ప్రస్తుతం చంద్రబాబు నిర్వహిస్తున్న కార్యక్రమానికి వచ్చినవారెంతమందన్నదీ చూడాలి. చంద్రబాబు దీక్ష కోసం దిల్లీ వచ్చిన వారి సంఖ్య గట్టిగా 5 వేలు కూడా లేదు. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రపంచంలో ఇంకెక్కడా ఈ స్థాయిలో లేదన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు.