Begin typing your search above and press return to search.

నిర్మలా సీతారామన్ బుర్రే బుర్ర

By:  Tupaki Desk   |   4 Oct 2015 7:17 AM GMT
నిర్మలా సీతారామన్ బుర్రే బుర్ర
X
ఏ వ్యాపారంలోనూ కనిపించని పరిస్థితి... ఏ వస్తువు అమ్మేవాడూ కోరుకోని కోరిక అది... కానీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దెబ్బకు ప్రకాశం జిల్లా పొగాకు రైతులు మాత్రం వ్యాపార సూత్రాలకు విరుద్ధంగా... మనిషి సహజ నైజానికి విరుద్ధంగా కోరుకుంటున్నారు. తాము అమ్మే పొగాకుకు తక్కువ ధర రావాలని కోరుకుంటున్నారు. ఎక్కువ రేటు వస్తుందేమోనని భయపడుతూ వేలం కేంద్రాలకు వెళ్తున్నారు. ఇదేంటి... విపరీతంగా లాభాలొచ్చేసి ఇన్ కం టాక్స్ ఎక్కువ కట్టాలని భయపడుతున్నారా అనుకోవద్దు... అదేమీ కాదు.. నిర్మలా సీతారామన్ గారి విచిత్ర నిర్ణయంతో వారు ఇలా తమ సరకుకు తక్కువ రేటు రావాలని కోరుకుంటున్నారు.

ప్రకాశం జిల్లా పొగాకు రైతులకు న్యాయం చేయడానికి కేజీ పొగాకుకు రూ.60 రేటు వచ్చేలా చేస్తానని ఆమధ్య హామీ ఇచ్చిన మంత్రిగారు అన్న మాట ప్రకారమే కేజీకి రూ.20 పరిహారం అనౌన్సు చేయించారు. అయితే.... కేజీ రూ.40 కంటే తక్కువ రేటు పలికే పొగాకుకే ఈ పరిహారం ఇస్తారు. రూ.40 అంతకంటే ఎక్కువ రేటొస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. అంటే రూ.40 కి అమ్మేవారికి రూ.40 మాత్రమే వస్తుంది... కానీ, రూ.39 రేటొచ్చిన రైతుకు మాత్రం మరో రూ.20 కలిసి ఏకంగా రూ.59 ధర వస్తుందన్నమాట. అంటే నాణ్యమైన సరుకు ఉంటే రైతు నష్టపోయినట్టే...

నిజానికి రూ.60 గిట్లుబాటయ్యేలా చేయాలంటే రూ.60 కటాఫ్ పెట్టి అంతకంటే ఎంత తగ్గితే అంత సర్దుబాటు చేస్తే సరిపోయేది కానీ, నిర్మలా సీతారామన్ మాత్రం విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో రైతులు తమకు సరకు బాగుంది రూ.40 రేటు వస్తుంది అనుకుంటే దాన్ని ఏదో చేసి పాడుచేసి తక్కువ రేటు వచ్చేలా చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

...చాలా తెలివైన మంత్రిగా అందరితో ప్రశంసలు అందుకునే నిర్మలమ్మ ఇలా బోల్తా పడ్డారేమిటో మరి.. బోల్తాపడితే పడ్డారు కానీ, రైతులను మాత్రం ఏకంగా ముంచేస్తున్నారు కదా.