Begin typing your search above and press return to search.

నిర్మలా సీతారామన్‌ కు ఇంటిపోరు

By:  Tupaki Desk   |   15 Oct 2019 7:39 AM GMT
నిర్మలా సీతారామన్‌ కు ఇంటిపోరు
X
మోదీ కేబినెట్లో సమర్థురాలిగా పేరు తెచ్చుకున్న వర్క్ మైండెడ్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక పరిస్థితి రీత్యా ఆ శాఖ మంత్రిగా ఇప్పటికే ఒత్తిడిలో ఉండగా - అది చాలదన్నట్లు ఆమె భర్త మీడియాలో రాస్తున్న వ్యాసాలతో మరింత ఒత్తిడికి గురవుతున్నారు. నిర్మలా మంత్రిగా ఉన్న ఆర్థిక శాఖ - మోదీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు కురిపించడం ఆమెకు ఇబ్బందిగా మారింది.

‘‘దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తోంది. ఒకదాని తర్వాత మరో రంగం పెను సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అయినా దీన్ని అంగీకరించేందుకు మోదీ సర్కారు సిద్ధంగా లేదు’’ అంటూ నిర్మలాసీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ ఆంగ్ల పత్రిక హిందూలో రాసిన వ్యాసం ఆమెను ఇరకాటంలో పడేసింది. ‘‘నెహ్రూ ఆర్థిక విధానాలను రాజకీయ కోణంలో విమర్శించడం తప్ప బీజేపీకి సొంత విధానమంటూ లేదు. ఆర్థికవిధానాలకు సంబంధించి ‘ఇది కాదు, ఇది కాదు’ అనడమే తప్ప ఏది ఉండాలన్న స్పష్టతలేదని విమర్శించారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు - మన్మోహన్‌ సింగ్‌ ల విధానాలే శరణ్యమని ఆయన రాసుకొచ్చారు.

కాగా ఈ విషయంలో బీజేపీ నేతలెవరూ నిర్మల వద్ద ప్రస్తావించనప్పటికీ ఆమె మాత్రం పరోక్షంగా దీనిపై స్పందించారు. 2014 నుంచి 2019 వరకు మౌలిక సంస్కరణల్ని చేపట్టింది మోదీ ప్రభుత్వమేనని ఆమె గుర్తు చేశారు. జీఎస్టీ - ఆధార్‌ - వంట గ్యాస్‌ పంపిణీ వంటి చర్యల్నీ చేపట్టింది మోదీ సర్కారేనని తెలిపారు.

కాగా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో గత అయిదేళ్లలో కొద్దికాలం పాటు సలహాదారుగా పనిచేసిన పరకాల ప్రభాకర్ తరువాత అక్కడ ప్రాధాన్యం కోల్పోయారు. బీజేపీ - టీడీపీలు కేంద్రంలో - ఏపీలో కలిసి ప్రభుత్వాలు నడిపినంత కాలం పరకాలకు ప్రాధాన్యమిచ్చారు. బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్న తరువాత పరకాలను చంద్రబాబు పక్కన పెట్టేశారు. అనంతరం చంద్రబాబు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. పరకాల కూడా ఏపీ నుంచి మళ్లీ దిల్లీకి మకాం మార్చారు. ఇటీవల ఆయన ఇన్‌ స్టాగ్రాంలో యాక్టివ్‌ గా ఉంటూ ఇంటి పరిసరాలు - తాను చదువుతున్న పుస్తకాలను పోస్ట్ చేస్తున్నారు.

అలాంటిది హఠాత్తుగా తన భార్య చేపట్టిన శాఖ పనితీరును విమర్శిస్తూ - ఆమె కీలక మంత్రిగా ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన రాసిన వ్యాసం చర్చనీయంగా మారింది. పరకాల వ్యవహారం నిర్మలాసీతారామన్‌ కు ఇబ్బందిగా మారింది.